రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం: ఎమ్మెల్యే రోజా

21 Oct, 2021 15:05 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఘాటుగా స్పందించారు. పట్టాభి వ్యాఖ్యలను రోజా తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు, పట్టాభి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పట్టాభిలాంటి వ్యక్తులతో ప్రెస్‌మీట్‌ పెట్టించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన తల్లి విజయమ్మను తిట్టించారని మండిపడ్డారు. సీఎం జగన్‌పై పట్టాభి చేత చంద్రబాబు చెప్పించిన అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబు, లోకేష్‌లపై చేయిస్తే భువనేశ్వరి సంతోషంగా ఉంటారా అని ప్రశ్నించారు. కుట్రపూరిత రాజకీయలకు, రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం మారిందని మండిపడ్డారు. 
చదవండి: దీక్ష పేరుతో చంద్రబాబు కొంగ జపం: పేర్ని నాని

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష చేపట్టారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ విమర్శ చేయవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని హితవు పలికారు. టీడీపీ కార్యాలయంలో నాలుగులు కుర్చీలు విరగ్గొడితే ప్రజస్వామ్యం ఖూనీ అయిందా అని ఆమె ప్రశ్నించారు. ఎప్పుడైతే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్న విషయం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. తిరుమల వచ్చిన అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు సిగ్గులేకుండా అమిత్ షాకు ఫోన్ చేసి రాష్ట్రానికి రావాలనడం సిగ్గుచేటని విమర్శించారు.

మరిన్ని వార్తలు