చంద్రబాబు తీరును ఎండగట్టిన వైస్సార్‌సీపీ నేతలు

13 Jan, 2021 20:56 IST|Sakshi

సాక్షి,  తాడేపల్లి/ విజయవాడ: వ్యవసాయం దండగ అని, రైతులపై కాల్పులు జరిపించిన వ్యక్తి.. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి చంద్రబాబుపై మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు హయాంలో రైతులను గాలికొదిలేసిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు రైతులకు ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని తమ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. విత్తనాలు నాటిన రోజే మద్దతు ధర ప్రకటించిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. 

గత ఎన్నికల్లో జరిగిన పరాభవాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. రాష్ట్రంలో కుట్రరాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారం పోయినప్పుడల్లా మారిన మనిషినంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడని, ఈసారి ప్రజలు ఆయనను విశ్వసించే స్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు. ఆయన ఎందుకు ఓడిపోయారో ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారని, ఓటమిని విశ్లేషించుకోలేని వ్యక్తి రాజకీయాలకు పనికిరారని అన్నారు. ఈ విషయంలో ట్రంప్‌కు, చంద్రబాబుకు పెద్ద తేడా లేదని ఎద్దేవా చేశారు. 

కాగా, 2019 ఎన్నికల్లోనే ప్రజలు.. టీడీపీకి చితిపెట్టి కాలగర్భంలో కలిపేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. జనం కట్టిన సమాధిలో నుంచి చంద్రబాబు చేస్తున్న కుట్రలు ఫలించవని ఆయన అభిప్రాయపడ్డారు. బాబు నేతృత్వంలోని టీడీపీని ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశారని, ఇక టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రజలు భోగ భాగ్యాలను అనుభవిస్తున్నారని జోగి రమేష్ తెలిపారు.

మరిన్ని వార్తలు