రఘురామ కేసులపై విచారణ వేగవంతం చేయాలి

7 Dec, 2021 05:24 IST|Sakshi

కేసుల నుంచి బయటపడేందుకు అధికార బీజేపీలో చేరాలని చూస్తున్నారు

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన కేసులపై కేంద్రం విచారణను వేగవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయనపై నమోదైన సీబీఐ కేసుల దర్యాపును ముమ్మరం చేయాలని కోరారు. సోమవారం లోక్‌సభ జీరోఅవర్‌లో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ రాజధాని సాధనకు పాదయాత్ర చేస్తున్న రైతుల పట్ల ఏపీ ప్రభుత్వ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. రఘురామ వ్యాఖ్యలను మిథున్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘రఘురామ రెండు సీబీఐ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రంలోని అధికార బీజేపీలో చేరాలనుకుంటున్నారు. బ్యాంకులను రూ.వేలకోట్లు మోసం చేసిన కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఆయనపై ఉన్న కేసుల విచారణను కేంద్రం ప్రభుత్వం వేగవంతం చేయాలి. దర్యాప్తు వేగిరంగా పూర్తిచేయాలి’ అని కోరారు.

వరదసాయం కింద రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి: మార్గాని భరత్‌
ఇటీవల వరద కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ గ్రాంటు కింద తక్షణమే రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ కోరారు. జీరోఅవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇటీవలి వరదలతో రాష్ట్రంలో రూ.6 వేలకోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉందన్నారు. 

కిసాన్‌రైల్‌ రాయితీని రూ.150 కోట్లకు పెంచండి: చంద్రశేఖర్‌
కరోనా మహమ్మారి సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్‌రైల్‌ సేవలకు ప్రభుత్వం ఏటా ఇస్తున్న రాయితీని రూ.50 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ కేంద్రాన్ని కోరారు. ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ రవాణా ఖర్చును టన్నుకు రూ.వెయ్యి, ప్రయాణ సమయాన్ని దాదాపు 15 గంటలు తగ్గించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ సేవలు ప్రయోజనం కలిగిస్తున్నాయని చెప్పారు.

దిశ బిల్లు త్వరగా ఆమోదించండి: వంగా గీత
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ బిల్లును త్వరితగతిన ఆమోదించి మహిళలు, బాలికలకు భరోసా కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఏపీ దిశ బిల్లు ఒక మైలురాయిగా పేర్కొంటూ 2019లో శాసనసభ ఆమోదించిందని చెప్పారు. మహిళలు,బాలికలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించి ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తిచేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్రం ఆమోదించాలన్నారు. ఇటువంటి కేసుల్లో సత్వర న్యాయం, కఠిన శిక్షల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయని చెప్పారు. వీటన్నింటని పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.   

మరిన్ని వార్తలు