సీఎం కేసీఆర్పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘విదేశీ కుట్రల మీద సమాచారం ఉన్న దొరకు.. వరదల నష్టం మీద సమాచారం అందలేదా’ అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల వానల తర్వాత దొరకు ఇవ్వాళ తీరిక దొరికిందా అని ఎద్దేవా చేశారు. వరద బాధిత ప్రజలను చూసేందుకు దొర ఇప్పటికైనా గడి నుంచి బయట అడుగు పెట్టారని, ఏరియల్ సర్వే చేసి, రాష్ట్రంపై విదేశీ కుట్ర జరుగుతోందని సెలవిచ్చారని విమర్శించారు.
వానలు, వరదలకు క్లౌడ్ బస్టర్ కారణమని కాకమ్మ కథలు చెప్పడం, బోడి గుండుకు మోకాలుకు ముడేసినట్లుందని వ్యాఖ్యానించారు. ‘లక్షల్లో ఆస్తి నష్టపోయి, గూడు కోల్పోయి బాధితులకు ప్రకటించిన సాయమన్నా సరిగ్గా అందుతుందా లేదా జీహెచ్ఎంసీలో వరద సాయమని గులాబీ లీడర్లు స్వాహా చేసినట్టు చేస్తారా’ అని సందేహం వ్యక్తం చేశారు.
చదవండి: (CM KCR: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు)