900 మందికి ఒకే టాయిలెట్టా..! 

21 Dec, 2022 01:04 IST|Sakshi

రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలో విద్యార్థుల దుస్థితి 

ట్విట్టర్‌ ద్వారా విద్యాశాఖ మంత్రి సబితను నిలదీసిన వైఎస్‌ షర్మిల 

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో తొమ్మి ది వందల మంది చదివే ఓ ప్రభుత్వ కళాశాలలో ఒక్క బాత్‌రూం ఉండటమా? అదీ విద్యా శాఖ మంత్రి ఇలాకాలోనా? ఇలా టాయిలెట్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కడం సిగ్గుచేటని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుది దరిద్రపు పాలనని చెప్పేందుకు ఇదొక్కటిచాలని మంగళవారం తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.

పిల్లలకు కనీసం బాత్‌ రూంలు కూడా కట్టలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత?..విద్యాశాఖ మంత్రి ఊడితే ఎంత అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాత్‌ రూంకు వెళ్లకుండా, పీరియడ్స్‌ రాకుండా టాబ్లె ట్‌ వేసుకుంటున్నామన్న బాలికల మాటలు వినడానికే భయానకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రం వస్తుందేమోనని నీళ్లు కూడా తాగడం లేదని చెప్తుంటే మనమింకా ఏ సమాజంలో ఉన్నామని నిలదీశారు.    

మరిన్ని వార్తలు