కేటీఆర్‌ వేములవాడను దత్తత తీసుకోవాలి: షర్మిల 

1 Nov, 2022 01:44 IST|Sakshi

కథలాపూర్‌ (వేములవాడ): ‘మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక ఉందని దత్తత తీసుకోవడం కాదు. మీ నియోజకవర్గం పక్కన ఉన్న వేములవాడ నియోజకవర్గాన్ని మంత్రి కేటీఆర్‌ దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి’అని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగించారు. కథలాపూర్‌లో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు యాదాద్రిపై ఉన్న ప్రేమ వేములవాడ రాజన్నపై లేదని మండిపడ్డారు.

వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని చెప్పిన పాలకులు హామీని విస్మరించారని మండిపడ్డారు. యాదాద్రిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉందని కేసీఆర్‌ అక్కడ అభివృద్ధికి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీ దేశంలో ఉంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే లేడని పక్క నియోజకవర్గానికి చెందిన కేటీఆర్‌కు తెలుసు. వేములవాడను కేటీఆర్‌ దత్తత తీసుకోవచ్చు కదా?’అని ఆమె ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు