దళితులను మోసం చేసిన కేసీఆర్‌

8 Nov, 2022 01:19 IST|Sakshi
షర్మిలకు స్వాగతం పలుకుతున్న మహిళలు 

నెన్నెల: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దళితుల సంక్షేమాన్ని గాలికి వదిలే­శారని, వారిని పథకాల పేరుతో మోసం చేస్తున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గుండ్లసోమారం, నార్వాయిపేట, చిత్తాపూర్, ఆవుడం గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని, దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రి వర్గంలో స్థానం కల్పించే వరకు దళితులను కేసీఆర్‌ చిన్నచూపే చూశారని విమర్శించారు. ఎంతమందికి దళితబంధు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

దళితులకు మూడెకరాల భూమి ఇస్తాన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.­రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతును రాజును చేయాలని భావించారన్నారు. కేసీఆర్‌ పాలనలో పంట నష్టపోతే పరిహారం ఇచ్చే దిక్కు లేదన్నారు. రైతులకు మేలు చేయడం చేతకాని వ్యక్తి ఇప్పుడు దేశాన్ని ఏలడానికి బయల్దేరడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్‌ పాలన రావాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీని ఆదరించాలని కోరారు. వైఎస్సార్‌ బిడ్డగా ప్రజలకు సేవ చేసేందుకే తాను ప్రజల ముందుకొచ్చానని వివరించారు.

>
మరిన్ని వార్తలు