గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు

29 Jul, 2020 04:23 IST|Sakshi

సాక్షి, అమరావతి/రాయచోటి: రాష్ట్ర గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎం.జకియా ఖానమ్, పండుల రవీంద్రబాబు నియమితులయ్యారు. వారిద్దరినీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాగా, ఎం.జకియా ఖానమ్‌ వైఎస్సార్‌ జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం మైనారిటీ మహిళ. డాక్టర్‌ పండుల రవీంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ. ఎస్సీ వర్గానికి చెందిన వారు. ఖాళీగా ఉన్న ఈ రెండు స్థానాలకు మైనారిటీ, బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేయటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. వీరిద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ ఇటీవల గవర్నర్‌కు పంపిన విషయం తెలిసిందే.

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్సీ మయాన జకియా ఖానమ్‌ తెలిపారు. గవర్నర్‌ నుంచి అధికారిక ప్రకటన రావడంతో జకియా ఖానమ్‌ స్పందించారు. వైఎస్సార్‌ కుటుంబానికి తన భర్త సన్నిహితంగా ఉండి పార్టీ కోసం పని చేశారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారాలను అందిస్తానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. 

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయా : ఎమ్మెల్సీ రవీంద్రబాబు
► రాజకీయాల్లోకి రాగానే అనేక మంది హామీలు ఇస్తారు.. కానీ అధికారంలోకి రాగానే అన్నీ మరిచిపోతారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి గ్రేట్‌ అనిపించుకున్నారు. 
► నాకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎమ్మెల్సీని చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాల్లో ఇచ్చిన మాటను ఈ విధంగా నిలబెట్టుకుంటారా? ఇది నిజమా అని నేను, నా కుటుంబం, స్నేహితులు షాకయ్యాం.
► దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక అన్నగా నిలబడి సీఎం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు.
► గత పదేళ్లు మేము అనాథలుగా ఉన్నాం. వైఎస్‌ జగన్‌ వచ్చాక దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక దిక్కు దొరికింది.
► పేద ప్రజలకు ఆయన ఎంతో అవసరం. జీవితాంతం ఆయనను గెలిపించుకుని అండగా నిలబడతాం.

జకియా ఖానమ్‌ ప్రొఫైల్‌
పుట్టిన తేదీ: 01–09–1973 
భర్త పేరు: దివంగత మయాన అఫ్జల్‌ అలీఖాన్‌ (మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్,  వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత)
పెళ్లి : 01–09–1989
తల్లిదండ్రులు: ఎం.హజీజ్‌ ఖానమ్, ఎం.దిలావర్‌ఖాన్‌ (రిటైర్డ్‌ హెచ్‌.ఎం)
విద్యాభ్యాసం: ఇంటర్‌ (డిస్కంటిన్యూ)
పిల్లలు: నలుగురు

పండుల రవీంద్రబాబు ప్రొఫైల్‌
పుట్టినతేదీ: 8–11–1955
తల్లిదండ్రులు: బుల్లియ్య, అన్నపూర్ణాదేవి
విద్యార్హత: ఎంబీబీఎస్, ఐఆర్‌ఎస్‌
భార్య: సునీత
ఉద్యోగం: ఊ వైద్యుడిగా ఢిల్లీలో సేవలు
► ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికై ముంబై, కోల్‌కతా, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ కమిషనర్‌గా పనిచేశారు. 
రాజకీయ రంగ ప్రవేశం: 2014లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా గెలుపొందారు.
► 2019 మార్చిలో వైఎస్సార్‌సీపీలో చేరిక

మరిన్ని వార్తలు