ఐటీ ఉద్యోగులకు డేంజర్‌ బెల్స్‌!

11 Dec, 2022 01:49 IST|Sakshi

డిసెంబర్‌ 9 వరకు తీసేసిన ఉద్యోగుల సంఖ్య 2,18,324

అమెరికా కంపెనీల్లోనే తొలగింపులు

కోవిడ్‌ అనంతర పరిస్థితుల్లో కంపెనీలు కుదేలు

తీవ్ర ఒడిదుడుకుల్లో స్టార్టప్‌లు

వీటిలోనూ భారీగానే ఉద్యోగాల కోత

వచ్చే ఏడాది మన దేశంలో తొలగింపులు ఉండే అవకాశం

ఆర్థిక వ్యవస్థకు మంచి శకునం కాదంటున్న నిపుణులు

2022లో 1,391 సార్లు తొలగింపులు ప్రకటించిన టెక్‌ కంపెనీలు 

నెలకు భారీ వేతనాలు, వారంలో రెండు రోజుల సెలవులు అందిస్తూ యువతకు డ్రీమ్‌ డెస్టినేషన్స్‌గా మారాయి.. ఐటీ కంపెనీలు. వీటిలో ఉద్యోగం సాధిస్తే చాలు.. ఇక జీవితం పూలబాటే అనేలా సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మధ్య మధ్యలో ఐటీ రంగంలో కొంత ఒడిదుడుకులు ఎదురైనా.. కోవిడ్‌ సంక్షోభంలోనూ ఐటీ కంపెనీలు భారీగానే లాభాలు ఆర్జించాయి. ఉద్యోగాలు సైతం పెద్ద ఎత్తున కల్పించాయి. అయితే నాణేనికి రెండో వైపు అన్నట్టు కోవిడ్‌ అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధ ప్రభావాలు, ఆర్థిక మాంద్యం సూచనలతో ఐటీ కంపెనీలు ప్రస్తుతం నష్టాలను తగ్గించుకునే పనిలో పడ్డాయి. లాభాలు అంతకంతకూ పడిపోతుండటంతో పొదుపు చర్యల్లో భాగంగా జాబ్స్‌ లేఆఫ్స్‌ (ఉద్యోగాల తొలగింపు) బాట పడుతున్నాయి. వీటిలో దిగ్గజ టెక్‌ కంపెనీలు సైతం ఉండటం అందరినీ కలవరపరుస్తోంది.  

ప్రస్తుతం మనదేశంలో పరిస్థితి బాగానే ఉన్నా టెక్‌ కంపెనీలకు కేంద్ర స్థానమైన అమెరికాలో భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు జరుగుతోంది. 2022­లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్‌ కంపెనీలు 1,391 సార్లు ఉద్యోగుల తొలగింపులు ప్రకటించాయని ప్రముఖ వెబ్‌సైట్‌.. ట్రూఅప్‌ బాం­బుపేల్చింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్‌ 9 వరకు ఏకంగా 2,18,324 మంది ఉద్యో­గులను టెక్‌ కంపెనీలు తొలగించాయని పేర్కొంది. ట్రూఅప్‌ను టెక్‌ కంపెనీలు, ఉద్యోగులు విశ్వసనీయమైనదిగా పరిగణిస్తో­న్న నేపథ్యంలో ఇప్పుడీ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

ఉద్యోగుల తొలగింపు ఎందుకు?
ఉద్యోగుల తొలగింపునకు ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత ఒక కారణమైతే.. ఉద్యోగుల పేలవమైన పనితీరు రెండో కారణమని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రముఖ ఇన్వె­స్ట్‌మెంట్‌ బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థ.. ‘గోల్డ్‌మన్‌ శాక్స్‌ రీసెర్చ్‌’ విశ్లేషణ ప్రకారం.. టెక్‌ రంగంలో ప్రతికూల పరిస్థితులకు ప్రధాన కారణాలు ఇవి..
- అస్థిర, కఠిన ఆర్థిక పరిస్థితులు, అధిక వడ్డీరేట్లు టెక్‌ రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రముఖ టెక్‌ కంపెనీల లాభాల మీద ఈ అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నా­యని నిపుణులు చెబుతున్నారు. ఈ కఠిన పరిస్థితులు దీర్ఘకాలం ఉంటాయని అంచనా. 
- ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాల్లో సంస్థల ప్రకటనల వ్యయం గణనీయంగా తగ్గిపోవడం, క్రిప్టో కరెన్సీ మార్కెట్ల బుడగ పేలిపోవడం కూడా టెక్‌ కంపెనీల కష్టాలకు కారణమేనని చెబుతున్నారు. 

మనదేశంలో పరిస్థితి ఏమిటి?
ఇక మన దేశంలో ప్రముఖ టెక్‌ కంపెనీల్లో పెద్దగా ఉద్యోగుల తొలగింపు లేదు. సాధారణ పరిస్థితుల్లో  కొంత మందిని తొలగించడం సహజంగానే జరుగుతూ ఉంటుందని అంటున్నారు. అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపుతో భారత టెకీల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటివరకు భారత్‌లో ఉద్యోగుల తొలగింపు ఆలోచన కంపెనీలకు లేదని నిపుణులు చెబుతుండటంతో భారత టెకీలు ఊరట చెందుతున్నారు. యాక్సెంచర్‌ కంపెనీ ఇటీవల 60 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను కాపాడుకోవడానికే టెక్‌ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని వివరిస్తున్నారు. టెకీల పరిభాషలో.. ఫాంగ్‌ (ఎఫ్‌ఏఏఎన్‌జీ) (ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌) కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇదే క్రమంలో విచ్‌ (డబ్ల్యూఐటీసీహెచ్‌) (విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌) కంపెనీలు 2022లో లక్ష మందికిపైగా ఉద్యోగులను నియమించుకోవడాన్ని నిపుణులు ఉదాహరణగా చూపుతున్నారు. 

వచ్చే ఏడాది కీలకం
ఈ ఏడాది భారత్‌లో టెక్‌ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు లేకపోయినా.. వచ్చే ఏడాది (2023) అమెరికా దారిలోనే మన కంపెనీలు కూడా వ్యవహరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దిశగా ఇప్ప­టికే సంకేతాలు ఇచ్చినట్లు పలు కంపెనీల హెచ్‌ఆర్‌ మేనేజర్లు ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే సంవత్సరం కీలక­మని.. ఉద్యోగుల తొలగింపు అవసరం రాకుంటే సమీప భవిష్యత్‌లోనూ కోత ఉండకపోవచ్చని వివరించారు. 

స్టార్టప్‌ కంపెనీల్లో సైతం..
కాగా గతంలో భారీ వేతన ప్యాకేజీలతో యువతను ఆకట్టుకున్న స్టార్టప్‌ కంపెనీలు సైతం ఈ ఏడాది ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, టెక్‌ రంగాలకు చెందిన 52 స్టార్టప్‌ కంపెనీలు 2022లో 17,604 మంది ఉద్యోగులను తొలగించినట్లు భారత్‌లో లేఆఫ్‌లను ట్రాక్‌ చేస్తున్న ‘ఐఎన్‌సీ42’ వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో.. బైజూస్, ఛార్జ్‌బీ, కార్స్‌24, లీడ్, ఓలా, మీషో, ఎంపీఎల్, ఇన్నోవేక్సర్, ఉడాన్, అన్‌అకాడమీ, వేదాంతు ఉన్నాయి. ఏడు ఎడ్‌టెక్‌ యూనికార్న్‌ కంపెనీల్లో నాలుగింటిలో 7,483 మంది ఉద్యోగులను తొలగించారు. అలాగే 15 స్టార్టప్‌ ఎడ్‌టెక్‌ కంపెనీల్లో ఐదు 2022లో మూతపడ్డాయి.  

ఆర్థిక వ్యవస్థకు ఇస్తున్న సంకేతాలేమిటి?
ఉద్యోగుల తొలగింపు ఆర్థిక వ్యవస్థకు మంచి శకునం కాదని నిపుణులు చెబుతు­న్నారు. ఆర్థిక వ్యవస్థలో టెక్‌ కంపెనీలు  భాగమే కాబట్టి.. ఆ కంపెనీల ఫలితాలు మార్కెట్‌ మీదా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. మరోవైపు ఉద్యోగుల తొలగింపు ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. అమెరికాలో మొత్తం ఉద్యోగు­ల సంఖ్యలో టెకీలు 3 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాబట్టి వారు ఉద్యో­గా­లు కోల్పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండదంటున్నారు. టెకీలు ఉద్యోగాలు కోల్పోయినా మళ్లీ వెంటనే మరో ఉద్యోగం సాధించే అవకాశం ఎక్కువగానే  ఉంటుందని వివరిస్తున్నారు. కాబట్టి ‘తొలగింపు’ నష్టం మరీ ఎక్కువగా ఉండదంటున్నారు. 

భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న కొన్ని ప్రముఖ సంస్థలు.. 
మెటా (ఫేస్‌బుక్‌): ఫేస్‌బుక్‌.. ‘టిక్‌టాక్‌’ లాంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. పోటీ సంస్థల ప్రవేశంతో ప్రకటనలపైన వచ్చే లాభాలు మెటాకు తగ్గిపోయాయి. మరోవైపు ఆర్థిక మాంద్యం పరిస్థితులు కూడా ఇందుకు కారణమయ్యాయి. మెటా ఆధ్వర్యంలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ ఉన్నాయి. ఆదాయాలు పడిపోవడంతో ఉద్యోగుల తొలగింపు తప్పలేదు. ఇది ‘మెటా’ బ్రాండ్‌ ఇమేజ్‌ని మసకబార్చేదేనని నిపుణులు చెబుతున్నారు. ఈ కంపెనీల్లో భారీ స్థాయిలో ఉద్యోగుల కోత ఇదే తొలిసారి.

ట్విట్టర్‌: అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. దాదాపు 50 శాతం మంది ఉద్యోగులపై వేటేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు వేల మంది కంపెనీ కాంట్రాక్టర్లపైనా కోత విధించారు. ఇదంతా పూర్తయ్యేవరకు ఎంత మంది ఉద్యోగులు మిగులుతారనే విషయం అంతుచిక్కడం లేదు. 

బైజూస్‌: ఏర్పాటైన అతి తక్కువ కాలంలోనే యూనికార్న్‌ కంపెనీగా ఎదిగింది.. బైజూస్‌. కోవిడ్‌ సంక్షోభంలో ఎడ్యుటెక్‌ కంపెనీ అయిన బైజూస్‌కు భారీగా డిమాండ్‌ పెరిగింది.  ఇప్పుడు స్కూళ్లు, కళాశాలలు యధావిధిగా నడుస్తుండటంతో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. దీంతో నష్టాలను తగ్గించు­కోవడానికి అక్టోబర్‌లో 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. 

పెలొటన్‌: హై ఎండ్‌ వర్కవుట్‌ పరికరాల తయారీ సంస్థ ఇది. కోవిడ్‌ సమయంలో ఈ కంపెనీ పరికరాల విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో అంతేస్థాయిలో లాభాలూ ఆర్జించింది. ఇప్పుడు విక్రయాలు తగ్గడంతో లాభాలను నిలబెట్టుకోవడం కోసం ఉద్యోగుల తొలగింపునకు పూనుకుంది.  

(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి)

మరిన్ని వార్తలు