అంతా మా ఇష్టం.. అడ్డొచ్చిన అధికారులకు బెదిరింపులు.. వెలుగులోకి జేసీ బ్రదర్స్‌ అక్రమాలు!

12 Oct, 2022 09:05 IST|Sakshi

నాలుగు దశాబ్దాలుగా అక్రమంగా ట్రావెల్స్‌ నిర్వహణ 

మున్సిపాలిటీలోనూ అంతులేని అవినీతి

అర్జాస్, అ్రల్టాటెక్, ట్రాన్స్‌పోర్ట్‌.. అన్నీ ఆదాయ మార్గాలే 

జేసీ సోదరుల కనుసన్నల్లోనే అసాంఘిక కార్యకలాపాలు 

అడ్డొచ్చిన అధికారులకు బెదిరింపులు

గత ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ. వేల కోట్ల దోపిడీ!  

టీడీపీ పాలనలో జేసీ సోదరులు (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి) అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు. నాలుగు దశాబ్దాలుగా ట్రావెల్స్‌ వ్యాపారంలో అక్రమంగా రూ.కోట్లు దండుకున్నారు. ఒక బస్సుతో ప్రారంభమైన ట్రావెల్స్‌ వ్యాపారం నుంచి వందల     సంఖ్యలో బస్సులు పుట్టుకొచ్చాయి. ఒక పర్మిట్‌   నంబర్‌తో నాలుగు బస్సులు తిప్పుతూ ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టించారు. ఎట్టకేలకు వీరి అక్రమాల పుట్ట కదులుతోంది. నిన్న త్రిశూల్‌... నేడు దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 

తాడిపత్రి అర్బన్‌: జేసీ సోదరులు అడ్డగోలు వ్యాపారాలు, అవినీతి అక్రమాలతో రూ.కోట్లు పోగేసుకున్నారు. ఒకేనంబర్‌పై పలు బస్సులను అనధికారికంగా నడిపారు. దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ కోచ్‌ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఓ ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు 2012లో రవాణాశాఖ కమిషనర్‌ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి కర్నూలు–హైదరాబాద్‌ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. మొబైల్‌ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ కోచ్‌ బస్సును సీజ్‌ చేశారు.

అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని బస్సులను సీజ్‌ చేయడం సంచలనం రేపింది. కండీషన్‌ లేని బస్సులు నడపడం వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతుండటం, ట్రావెల్స్‌ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వాహనాలపై నిఘా అధికమైంది. అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులను ఎక్కడికక్కడ సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.  

గ్రానైట్‌ మాఫియా 
తాడిపత్రిలో 850 వరకు గ్రానైట్‌ పరిశ్రమలున్నాయి. వీటన్నింటికీ కలిపి 70 లారీలతో 20 నుంచి 30 మంది ట్రాన్స్‌పోర్టర్లు గ్రానైట్‌ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. ఒక లోడు గ్రానైట్‌ క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల మేర రాయల్టీ చెల్లించాలి. అయితే రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్‌ చేర్చేలా క్వారీ యాజమాన్యం, తాడిపత్రి పాలిష్‌ మిషన్‌ వ్యాపారుల మధ్య కుదిరిన ఒప్పందం మాఫియాను తలపించింది. అలాగే లారీలో ఉన్న గ్రానైట్‌ పరిమాణాన్ని బిల్లులో తగ్గించి, ఒకే బిల్లుతో ఐదారు లోడ్లు రవాణా చేస్తుండేవారు. ఈ డబ్బులు మొత్తం మాఫియాను నడిపే ఓ ‘పెద్దమనిషి’ ఇంటికి చేరవేసేవారు. అక్కడ వాటాల పంపకం జరుగుతుండేది. 

నిజాయితీ అధికారులకు వేధింపులు
మైనింగ్‌ విజిలెన్స్‌ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలోని అక్రమాల గురించి తెలిసి షాక్‌ అయ్యారు. ఈ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా రూ.కోటి కూడా పెనాల్టీ రూపంలో వచ్చేవి కావు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. దందా ఏ స్థాయిలో సాగిందో ఈ జరిమానాలు చూస్తే తెలిసిపోతుంది. ఇలాంటి నిజాయితీ అధికారి ఇక్కడ ఉంటే ఆటలు సాగవని బదిలీ చేయించాలని చూశారు. చివరకు చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీంతో గ్రానైట్‌ మాఫియాతో తనకు ముప్పు ఉందంటూ మైనింగ్‌ విజిలెన్స్‌ డైరెక్టర్‌కు ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని ఏ1గా, గ్రానైట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ప్రతాప్‌రెడ్డిని ఇక్కడి నుండి ఆ మాఫియానే బదిలీ చేయించి తమ అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగించేది. అధికారాన్నీ అడ్డుపెట్టుకుని గ్రానైట్‌ మాఫియా ద్వారా రూ.200 కోట్లకు పైగా ఆర్జించారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి.  

ట్రాన్స్‌పోర్టు ద్వారా రూ.300 కోట్లు 
అర్జాస్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం హుసేనాపురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు 2వేల ఎకరాల వరకు స్వాధీనం చేశారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ఈ ప్లాంటుపై ఆధారపడి జీవించే వారు. అయితే దివాకర్‌ రోడ్‌లైన్స్, ట్రాన్స్‌ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్‌ సొంతంగా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్‌ ట్రాన్స్‌పోర్టును కాదనే ధైర్యం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత వారికే ఇస్తూ వచ్చేవారు. అయతే ఇందుకు సంబందించిన బిల్లులను జేసీ బ్రదర్స్‌ ట్రాన్స్‌పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్‌ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్‌ కూడా ఎగ్గొడుతున్నట్లు సమాచారం. లారీలపై జేసీపీఆర్‌ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం బినామీ లెక్కలే. ఈ లారీలు మినహా ఇతర లారీలు స్టీల్‌ప్లాంట్‌లో వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్ళలోట్రాన్స్‌పోర్టు ద్వారా రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది.  

డ్రై స్లాగ్‌ ద్వారా కోట్లు కొల్లగొట్టారు
అర్జాస్‌ స్టీల్‌ ప్లాంట్‌లో డ్రైస్లాగ్‌ను టన్ను రూ.10 తో టీడీపీ నేతలు కొనుగోలు చేసేవారు. దీనిని అ్రల్టాటెక్‌ సిమెంట్, సాగర్‌ సిమెంట్‌ పరిశ్రమలకు తరలించి టన్ను రూ.850 చొప్పున విక్రయించేవారు. ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చుల కింద రూ.250 పోగా రూ.600 మేర మిగులుతుండేది. ప్రతి నెలా 25వేల టన్నులకు పైగా డ్రై స్లాగ్‌ను ఈ స్థాయిలో తరలించే వారు. ఈ లెక్కన నెలకు రూ.1.5 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100కోట్ల ఆదాయం గడించినట్లు తెలుస్తోంది.  

రాజకీయ అవసరాలకు మట్కా డాన్‌  
తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ అవసరాలకు మట్కా డాన్‌ రషీద్‌ స్పాన్సర్‌గా వ్యవహరించేవాడు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కార్లు కొనుగోలు చేస్తే వాటికి నెలవారీ కంతులు కూడా రషీద్‌ చెల్లించేవాడని తెలిసింది. 

దేవుని మాన్యాన్నీ వదలని సోదరద్వయం  
పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో వెలసిన పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆలయంలో ధూప దీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు. అయితే తాడిపత్రి – పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కబ్జా చేసి పంట సాగు చేపట్టారు. రెండు పెద్ద ఫారంపాండ్లు ఏర్పాటు చేయించి బోరుబావుల నీటితో వాటిని నింపారు. ఈ నీటితో మాన్యం భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా చెల్లించలేదనే ఆరోపణలు వినిపించాయి. ఏడాది క్రితం విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారులు ఆ భూములన్నీ జేసీ ఆధీనంలో ఉన్నాయని గుర్తించారు. మూడు నెలల క్రితం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.    

ఆదర్శ మున్సిపాలిటీని గలీజు చేసి..
తాడిపత్రి మున్సిపాలిటీ పేరుకే ఆదర్శం. జేసీ సోదరులు, వారి అనుచరులు ఆదర్శ మున్సిపాలిటీ మాటున రూ.200 కోట్లకు పైగా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్‌రెడ్డి బినామీగా వ్యవహరించిన ఎస్‌.వి.రవీంద్రారెడ్డి తాడిపత్రిలోని జేసీ నాగిరెడ్డి మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో మొదటి అంతస్తు టెండర్‌ దక్కించుకున్నాడు. ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. దీనికి గుడ్‌విల్‌ రూపంలో రూ.2.66 కోట్లు మున్సిపాలిటీకి బకాయి చెల్లించాల్సి ఉంది. మొదటి అంతస్తుకు సంబంధించి రూ.2.73 కోట్లు మున్సిపాలిటీకి బకాయి పడ్డారు.

ఈ మొత్తం కాంప్లెక్స్‌ను దాదాపు 50 మంది వ్యాపారులకు సబ్‌లీజుకు ఇచ్చేశారు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.20వేల నుంచి రూ.30వేల చొప్పున అద్దె వసూలు చేశారు. నెలకు రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షలు ఆదాయం వచ్చేది. ఇదే కాంప్లెక్స్‌లో 64, 68 షాపులు కూడా ఎస్‌.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి సంబంధించి రూ.3.52 లక్షలు గుడ్‌విల్‌ రూ.3.33 లక్షలు బాడుగ కలిపి మొత్తం రూ.7.83 లక్షలు బకాయి పడ్డారు. దీంతో ఈ దుకాణాల లీజును మున్సిపల్‌ అధికారులు రద్దు చేశారు. కానీ ఈ దుకాణాలు లీజుకు ఇచ్చి ప్రతినెలా భారీగా అద్దె వసూలు చేశారు. గడిచిన ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగించారు. దీంతో పెద్ద ఎత్తున మున్సిపల్‌ ఆదాయానికి గండిపడింది.

ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో 64, 76, 68, 62 నంబర్‌ షాపులను కూడా ఎస్‌.వి.రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి రూ.2వేల చొప్పున మాత్రమే అద్దె చెల్లిస్తున్నాడు. వ్యాపారులకు మాత్రం రూ.20వేల నుంచి రూ.30వేల వరకు సబ్‌లీజుకు ఇచ్చుకున్నాడు. రెండు కాంప్లెక్స్‌లోని అద్దెలు రవీంద్రారెడ్డి వసూలు చేసినా, ఈ డబ్బులు తిరిగి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరినట్లు సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం.    

మరిన్ని వార్తలు