భారత రాష్ట్ర కిసాన్ సమితితో మొదలు.. బీఆర్‌ఎస్‌ కోసం కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌

20 Dec, 2022 18:28 IST|Sakshi

అధినేత సూచనలతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే క్రేత్రస్థాయిలో ప్రారంభానికి సిద్దమైన బీఆర్‌ఎస్‌

డిసెంబర్ నెలాఖరు కెల్లా 6 రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న భారత రాష్ట్ర కిసాన్ సమితి ( బీఆర్ఎస్ కిసాన్ సెల్)

మహారాష్ట్ర, కర్నాటక, ఒడిసా సహా పలు  రాష్ట్రాల్లో ఎగరనున్న బిఆర్ఎస్ జెండాలు

దేశవ్యాప్తంగా  బిఆర్ఎస్ భావజాల వ్యాప్తి కోసం పలు భాషల్లో పాటలు, సాహిత్యం సిద్దం.

కన్నడ, మరాఠా,ఒడిస్సా సహా పలు భారతీయ భాషల సాహిత్య కారులు, పాటల రచయితలకు ఈ దిశగా సూచనలిస్తున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌

ఇప్పటికే ఢిల్లీలో సంప్రదింపులు జరిపిన పలువురు ప్రముఖులు సంస్థలు

డిసెంబర్ నెలాఖరులో బీఆర్ఎస్ అధినేత జాతీయ మీడియా సమావేశం.. విధి విధానాలు ప్రకటన

సాక్షి ప్రత్యేకం: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) పార్టీ ఆవిర్భావం అయితే జరిగింది. మరి మిగతా రాష్ట్రాల్లో కార్యకలాపాలు ఎప్పుడు?. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పడం మొదలయ్యేది ఎప్పుడు? ఆ ప్రశ్నలకు ఓ సమాధానం ఇప్పుడు దొరికింది. డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. పార్టీ పేరును మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల అధికారికంగా సమాచారం వచ్చిన వెంటనే అధినేత కేసీఆర్ కార్యక్రమాలను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ను అధికారికంగా ప్రకటించి వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టారు. వీలయినంత త్వరలో ఢిల్లీలో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు.

ఢిల్లీలో జాతీయ కార్యాలయ ప్రారంభం.. దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి :
కేసీఆర్ డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం  ప్రారంభం అవుతున్నదనే నేపథ్యంలో.. ఆ లోపే బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించి, ఢిల్లీలో వేదికను సిద్దం చేయాలనే తలంపుతో వున్న అతికొద్ది సమయంలోనే ఢిల్లీ టూర్ ను అధినేత కెసిఆర్ చేపట్టారు. అటు ఉత్తరాదినుంచి ఇటు దక్షిణాది నుంచి అఖిలేష్ యాదవ్., కుమార స్వామి వంటి మాజీ సిఎం లు, ప్రముఖ పార్టీల అధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశ రాజకీయ విమర్శకులు మేథావులు ఆశ్చర్యపోయేలా అత్యద్భుతంగా బిఆర్ఎస్ కార్యాలయాన్ని డిసెంబర్ 14 న అధినేత కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలనుంచి ఢిల్లీ కి చేరుకున్న సీనియర్ రాజకీయ నాయకులు, రచయితలు, మేథావులు, ప్రముఖులు  వందలాదిగా బిఆర్ఎస్ అధినేతకు స్వయంగా కలిసి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకుని పనిచేయడానికి తమ సంసిద్దతను వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాలనుంచి ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకులు పలు సామాజిక వర్గాల సంఘాల నేతలు, పలు రంగాలకు చెందిన వృత్తులకు చెందిన మేధావులు, యువతీ యువకులు బిఆర్ఎస్ లో చేరి అధినేత కేసీఆర్ వెంట కలిసి నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్న వర్తమాన పరిస్తితి దేశవ్యాప్తంగా నెలకొన్నది.

పలు రాష్ట్రాల్లో భారత రాష్ట్ర కిసాన్ సమితి ( బీఆర్‌కేఎస్) ప్రారంభం :
‘‘ఎద్దు ఏడ్సిన యవుసం.. రైతు ఏడ్సిన రాజ్యం ముందట పడదు’’ అనే నానుడి వ్యవసాయాధారిత దేశంలోని ప్రజల నాలుకల మీద వుంటుంది. అటువంటి అత్యంత ప్రాముఖ్యతనివ్వాల్సిన వ్యవసాయం సాగునీటి రంగాన్ని దశాబ్దాలుగా దేశ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనను అధినేత కెసిఆర్ పలు మార్లు ప్రకటించారు. ఈ తాత్వికతతోనే తెలంగాణ సాధన అనంతరం తక్షణమే వ్యవసాయం సాగునీటి రంగానికి పెద్ద పీట వేశారు. అనతికాలంలోనే దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారడంలో సిఎం కెసిఆర్ దార్శనికత అకుంఠిత ధీక్ష ప్రధాన కారణం. నేడు రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులను ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయం సాగునీటి రంగాన్ని కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పటిష్ట పరిచి అన్నం పెట్టే  దేశ రైతన్నను కాపాడుకోవాలనే దీర్ఘకాలిక ధ్యేయంతో మహోన్నత ధ్యేయంతో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ స్పూర్తితో ముందడుగు వేసిండు.

‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’
ఈ నేపథ్యంలో  ‘ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో ముందుకు పోవాలని పార్టీ అధికారిక ఆవిర్భావం నాడు హైద్రాబాద్లో  ప్రకటించిన అధినేత కేసీఆర్ అందుకు అనుగుణంగా ముందస్తుగా 6  రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసుకుని క్రిస్మస్ పండగ అనంతరం ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అటు ఉత్తర భారతం, ఇటు తూర్పు, మధ్య భారతాలకు చెందిన  పలు రాష్ట్రాలనుంచి అనేకమంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు, తమ టీం లతో, అనుచరులతో వచ్చి స్వయంగా అధినేత కేసీఆర్ తో సంప్రదింపులు జరిపుతున్నారు. చర్చల అనంతరం ఏర్పాట్లు చేసుకోవడానికి తిరిగి వారి వారి రాష్ట్రాలకు వెలుతున్నారు.  ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక సామాజిక సాంస్క్రతిక పరిస్తితులు నేపథ్యాలను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎటువంటి విధానాలను అవలంభించాల్నో వారికి సుధీర్ఘంగా అధినేత కేసీఆర్ వివరించి వారిని ఆ దిశగా సమాయత్తం చేసి పంపుతున్నారు.
 ఈ నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బిఆర్ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించనున్నారు.

బీఆర్‌ఎస్‌ భావజాల వ్యాప్తి  :
ఈ నేపథ్యంలో ఇప్పటికే కన్నడ, ఒరియా, మరాఠా,వంటి పలు భారతీయ భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు.  దేశవ్యాప్తంగా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, బిఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే కార్యాచరణ గురించి భావజాల వ్యాప్తి కోసం సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ దేశంలో.. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అందుకోవాల్సిన గుణాత్మక మార్పులు ఏమిటి.? వాటిని బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దేశ ప్రజలకు అందించబోతున్నది..ప్రత్యామ్న్యాయ రాజకీయ వేదికగా బిఆర్ఎస్ తన పాత్రను భవిష్యత్తులో ఎట్లా పోశించబోతున్నది ? ఈ దేశ సకల జనులకు సబ్బండ వర్గాల ఆకాంక్షలకు చిరునామాగా బిఆర్ఎస్ ఎట్లా నిలవబోతున్నది ? అనే తాత్విక సైద్దాంతిక అంశాలను పలు భాషా సాహిత్యాలు రచనలు పాటల ద్వారా భావజాల ప్రచారం జరగనున్నది. ఆయా రంగాల వారిగా సాహిత్య సాంస్కృతిక మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తంగా భావజాల వ్యాప్తి చేయడానికి అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు నెలలనుంచి  సాహితీ వేత్తలతో లోతైన విశ్లేషణలు చర్చలు చేపట్టారు. త్వరలో అవి కార్యరూపం దాల్చడానికి రంగం సిద్దమైంది.

ఊపందుకోనున్న బీఆర్‌ఎస్‌ కార్యాచరణ
క్రిస్మస్ పండుగ తర్వాత నుంచి బిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల ఉదృతి పెరగనున్నది. ఈ మేరకు ముందస్తుగా  6 రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కే కార్యకలాపాలను ప్రారంభం కానున్నాయి. తద్వారా బిఆర్ఎస్ జాతీయ స్థాయిలో తన వాణిని వినిపిస్తూ., దేశ ప్రజలను ఆకర్షిస్తూ చారిత్రక దశలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించనున్నది. 

డిసెంబర్ నెలాఖరున ఢిల్లీలో జాతీయ మీడియాతో సమావేశం :
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో జాతీయ మీడియా లో ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. దేశంలో గుణాత్మక రాజకీయాలు వాటితో పాటు కేంద్రంలో గుణాత్మక పాలన రావాలంటే ఏ దిశగా అడుగులు వేయాలో, ఈ దేశ ప్రజల కర్తవ్యం ఏమిటో ఇప్పటికే బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్ పలుమార్లు ఉద్ఘాటించారు. ‘‘గెలవాల్సింది రాజకీయ నాయకులు పార్టీలు కాదు.. ప్రజలు.. ప్రజా ప్రతినిధులు’’ అని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ దేశానికి ప్రత్యామ్న్యాయం అంటే.. కొన్ని పార్టీలతో జతకట్టే రాజకీయ ఫ్రంటులు కాదనీ.. దేశ ప్రజలకు మేలు చేసే ప్రత్యేక ఎజెండాతో ముందుకు పోయే రాజనీతిజ్జత కావాలని సిఎం కేసీఆర్ ప్రకటించిన నేఫథ్యంలో బిఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణ పై జాతీయ మీడియాలో ఉత్కంఠ నెలకొంది. బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ఏమిటి ? రాజకీయ సైద్దాంతికత ఏమిటి .? అభివృద్ధి నమూనా ఏమిటి అనే విషయంలో ఇప్పటికే జాతీయ మేధావి వర్గం చర్చ చేస్తున్న సంగతి తెలిసిందే. 

‘‘అంధకారబంధురంగా మారిన వర్తమాన రాజకీయ పాలన యవనికమీద వెలుగు దివ్వెను వెలిగిస్తాం..’’..అనే అధినేత సిఎం కెసిఆర్ ప్రకటన దేశవ్యాప్తంగా అటుమీడియా ఇటు రాజకీయ విమర్శకుల లాబీల్లో చర్చనీయాంశంగా మారిన సందర్బంలో...ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాతో కెసిఆర్ భేటీ కానున్నారు.  ఈ సందర్భంగా పలు జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు, వార్తా సంస్థల జర్నలిస్టులతో బీఆర్‌ఎస్‌ అధినేత సమావేశం కానున్నారు. డిసెంబర్ నెలాఖరు లో ఢిల్లీ లో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి బిఆర్ఎస్ పార్టీ సిద్దాంతాలు భవిష్యత్తు కార్యాచరణ సహా  విధి విధానాలను ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు