Railway Accidents: నిబద్ధతతో వ్యవహరించి.. రాజీనామా చేసిన నాటి రైల్వే మంత్రులు వీరే..

4 Jun, 2023 12:30 IST|Sakshi

ఒడిశాలోని బాలాసోర్‌ ఘోర రైలు ప్రమాదం దేశ చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచి త్రీవ విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో వందలాది మంది మృత్యువాత పడగా, వెయ్యిమందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్‌ రాజీనామా చేయాలంటూ డిమాండ్‌లు గట్టిగా వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో సైతం హ్యాష్‌ ట్యాగ్‌లో ట్రెండింగ్‌ చేస్తూ.. రాజీనామా చేయాల్సిందే అంటూ పోస్టులు వస్తున్నాయి.

అదీగాక అశ్విని వైష్ణవ్‌ సొంత రాష్టంలోనే ఈ ఘోర రైలు ప్రమాదం జరగడంతో మరింత తీవ్ర స్థాయిలో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు గతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన నాటి మంత్రులను గుర్తు చేసుకుంటున్నారు. నాటి మంత్రులలో ఉన్న నిబద్ధత, నైతికత ఇప్పుడూ కానరావడం లేదంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే గతంలో జరిగిన రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామాలు చేసిన నాటి ముఖ్యమంత్రులు ఎవరంటే...

గతంలో రాజీనామ చేసిన రైల్వే మంత్రులు
👉1956లో లాల్‌ బహదూర్‌ శాస్త్రీ హయాంలో రెండు రైలు ప్రమాదాలు జరిగాయి. ఆగస్టులో ఉమ్మడి ఏపీలో జరిగిన ప్రమాదంలో 112 మంది మరణించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. దీన్ని నెహ్రూ అంగీకరించలేదు. రెండోసారి అదే ఏడాది నవంబర్‌లో తమిళనాడులో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 144 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. దీంతో శాస్త్రీ వెంటనే నెహ్రూకి రాజీనామా సమర్పించడమే గాక వెంటనే ఆమెదించాలని విజ్ఞప్తి చేశారు. ఆ నాడు శాస్త్రీ చేసిన రెండో రాజీనామా ప్రజల దృష్టిని ఆకర్షించింది కూడా. ఇది సాంకేతిక లోపమని రైల్వే బోర్డు బాధ్యత వహించాలని పలువురు నచ్చచెప్పేందుకు చెబుతున్న శాస్త్రీగారు వెనక్కి తగ్గలేదు. ఇక అప్పడు నెహ్రు ఇది తనకు క్లిష్టమైన నిర్ణయం అంటూ ఆయన రాజీనామాను ఆమోదించారు.

👉1999 ఆగస్టులో అసోంలో జరిగిన రైలు ప్రమాదంలో 290 ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో నితీశ్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన అసోం రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిష్క్రమణ తర్వాత సరిగ్గా 43 ఏళ్ల తర్వాత రైల్వే మంత్రి నుంచి వచ్చిన రెండవ రాజీనామా ఇది.  

👉ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో ఎన్డీయే ప్రభుత్వం హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. 2000వ సంవత్సరంలో రెండు రైలు ప్రమాదాలు జరగడంతో ఆమె నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అయితే అప్పటి ప్రధాని అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి ఆమో రాజీనామాను తిరస్కరించారు. 

👉2016లో నాలుగు రోజుల వ్యవధిలో కైఫియత్ ఎక్స్‌ప్రెస్, పూరీ-ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు రైళ్లు పట్టాలు తప్పినందుకు నైతిక బాధ్యత వహిస్తూ 2017 ఆగస్టు 23న రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సురేష్ ప్రభు ప్రతిపాదించారు. కొంత సమయం వేచిచూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరగా.. ఆ తరువాత కొద్ది నెలల్లోనే ప్రభుత్వానికి రాజీనామా చేశారు. కాన్పూర్ సమీపంలో పాట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ 14 కోచ్‌లు పట్టాలు తప్పడంతో 150 మంది చనిపోయారు. 1999 తర్వాత ఇది అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి.

(చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే)

మరిన్ని వార్తలు