సింధుకు గిఫ్ట్‌ ఇవ్వమంటే ఆనంద్‌ మహేంద్ర ఏమన్నాడంటే..?

2 Aug, 2021 13:24 IST|Sakshi

వరుసగా రెండోసారి ఒలింపిక్‌ పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పారిశ్రామిక దిగ్గజం మహేంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహేంద్ర పీవీ సింధును ప్రశంసించారు. ఆమెను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. నువ్వింకా బంగారు తల్లివి అని కీర్తించారు. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు. దీనిపై కామెంట్ల కూడా చేస్తున్నారు. 

ఈ సమయంలో ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌.. ఆ ట్వీట్‌కు ఆనంద్‌ మహేంద్ర రిప్లయ్‌ ఇవ్వడం వైరల్‌గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఫాలోవర్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. సింధును అభినందిస్తూ ఆనంద్‌ మహేంద్ర చేసిన ట్వీట్‌పై శుభ్‌ వదేవాల కామెంట్‌ చేశారు. ‘సింధు అత్యుత్తమ ప్రదర్శనకు థార్‌ (మహేంద్ర కంపెనీకి చెందిన వాహనం) కానుక’ అని రిప్లయ్‌ ఇచ్చారు. సింధుకు థార్‌ కావాలి అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా క్రియేట్‌ చేశారు. 

ఈ కామెంట్‌ను చూసిన ఆనంద్‌ మహేంద్ర రిప్లయ్‌ ఇచ్చాడు. ‘సింధుకు ఇంతకుముందే థార్‌ వాహనం ఉంది’ అని మహేంద్ర తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో విజయం సాధించినప్పుడు సింధుకు థార్‌ వాహనం అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ దానికి సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు. సాక్షి మాలిక్‌తో కలిసి సింధు థార్‌ ఎస్‌యూవీ వాహనంపై తిరుగుతున్న ఫొటోతో ఆ నెటిజన్‌కు బదులిచ్చారు.
 

మరిన్ని వార్తలు