రెమిడిసివర్‌ కోసం మెడికల్‌ ఆఫీసర్‌ కాళ్లుపట్టుకున్న మహిళ

28 Apr, 2021 13:38 IST|Sakshi

లక్నో: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అందరు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లో రోగులకు సరిపడా బెడ్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌లు, వ్యాక్సిన్‌లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది.

యూపీలోని ఒక ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పోందుతున్న బాధితుడికి యాంటి వైరల్‌ డ్రగ్‌.. రెమిడిసివర్‌ లభించలేదు. దీంతో వారి కుటుంబీకులు భయాందోళన చెందారు. అదే సమయంలో అక్కడికి మెడికల్‌ ఆఫీసర్‌ దీపక్‌ ఓరి వచ్చారు. ఇది చూసిన రోగి బంధువు ఒక్కసారిగా మెడికల్‌ ఆఫీసర్‌ పాదాలు పట్టుకుని కన్నీటిపర్యంతమైంది. ఎలాగైనా రెమిడిసివర్‌ ఇచ్చి తమ వారిని కాపాడాలని అభ్యర్థించింది.

ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అక్కడ రోగులందరూ దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ సంఘటన అక్కడ కేసుల తీవ్రత, మందుల కోరత ఏ మేరకు ఉందో తెలియజేస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇది చాలా బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు. కాగా, బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై వివారాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు