పరుగో పరుగు.. పెళ్లి కొడుకును 4 కిలోమీటర్లు లాకెళ్లిన గుర్రం

23 Jul, 2021 18:12 IST|Sakshi

జైపూర్‌ (రాజస్థాన్‌): బంధుమిత్రులతో కలిసి వివాహ మండపానికి వరుడు ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఈ సందర్భంగా డప్పుచప్పుళ్ల మధ్య ఉత్సాహంగా వరుడు అశ్వంపై కూర్చొని బయల్దేరాడు. బంధువులు డ్యాన్స్‌లు చేస్తూ సంబరంగా వెళ్తూ మధ్యలో బాణసంచా కాల్చారు. పటాకుల చప్పుడుకు గుర్రం అదిరింది. వరుడితో పాటు గుర్రం పరుగులు పెట్టింది. అలా నాలుగు కిలోమీటర్ల దాక లాకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లా రాంపుర గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం నిశ్చయమైంది. పెళ్లి నసీరాబాద్‌లో ఉండడంతో గ్రామం నుంచి ఊరేగింపుగా బంధుమిత్రులతో వరుడు అశ్వంపై బయల్దేరాడు. మార్గమధ్యలో రంగురంగుల కాగితాలు వచ్చేలా ఉండే బాంబు పేల్చారు. భారీ శబ్ధంతో అవి పేలడంతో గుర్రం అదిరింది. భయాందోళనతో గుర్రం పరుగులు పెట్టేసింది. గుర్రంతో పాటు పైన కూర్చున్న వరుడిని కూడా తీసుకెళ్లింది. దీంతో బంధువులంతా కంగారు పడ్డారు. గుర్రాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేయగా అది అతివేగంతో ఉరుకులు ఉరికింది. ఆ విధంగా గుర్రం ఏకంగా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వెళ్లింది. ఇంత జరిగినా కూడా ఆ వరుడికి గాయాలేమీ కాలేదు. దీంతో బంధువులు, వధువు తరఫు వారు ఊపిరి పీల్చుకున్నారు. చివరకు వరుడు మండపానికి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన ఇటీవల జరిగింది.

మరిన్ని వార్తలు