1st T20I: నేడు ఇంగ్లండ్, భారత మహిళల తొలి టి20

10 Sep, 2022 05:06 IST|Sakshi

కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన చోటే భారత మహిళలు ఇప్పుడు ఇంగ్లండ్‌పై గెలిచేందుకు శ్రమించనున్నారు. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి పొట్టి మ్యాచ్‌ నేడు చెస్టర్‌ లీ స్ట్రీట్‌లో జరుగుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న హర్మన్‌ప్రీత్‌ సేన ఫినిషింగ్‌ లోపాలతో ‘బంగారం’లాంటి అవకాశాన్ని చేజార్చుకుంది.

బ్యాటింగ్‌లో అప్పటిదాకా బాగా ఆడే అమ్మాయిలు విజయానికి చేరువగా వచ్చి చేతులెత్తేయడం ఐసీసీ ఈవెంట్లలో పరిపాటిగా మారింది. అయితే ఇకపై ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. ‘కామన్వెల్త్‌లో మేం బాగా ఆడాం. కానీ ఇంకా మెరుగవ్వాలి. లోపాలు సరిదిద్దుకోవాల్సి వుంది’ అని కెప్టెన్‌ చెప్పింది. రా.గం. 11.30 నుంచి జరిగే మ్యాచ్‌ను సోనీ టెన్‌–1 చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.  

మరిన్ని వార్తలు