2007 T20 World Cup: 'శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు.. ప్రపంచకప్‌ను పట్టుకున్నాడు'

24 Sep, 2022 17:26 IST|Sakshi

సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. ఇదే రోజున టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. జోహన్స్‌ బర్గ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను ధోని సేన ముద్దాడింది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండా..  అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్‌ అందరి అంచనాలను తారుమారు చేస్తూ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

కాగా 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయాన్ని మరోసారి గుర్తుచేసుకునేందుకు స్టార్‌ స్పోర్ట్స్‌" ది రీయూనియన్ ఆఫ్ 07" అనే షోను నిర్వహించింది. ఈ షోలో తొలి పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యులుగా ఉన్న ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌లో తమ మధుర జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు. 

శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు..
ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడూతూ.. 2007 టీ20 ప్రపంచకప్‌ సమయంలో సోషల్‌ మీడియా లేదు. కానీ ఫైనల్లో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్‌తో తలపడడం అంత సులభం కాదని అంతా చర్చించుకున్నారు. నిజంగానే ఫైనల్లో మాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది.

ఫైనల్లో నా నాలుగు ఓవర్లు కోటా పూర్తి చేసిన తర్వాత నేను చాలా అలసిపోయాను. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇంత అలసిపోలేదు. ఆ సమయంలో నాకు కొంచెం కూడా ఓపిక లేదు. ఇక ఈ మ్యాచ్‌లో  శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు, అతడు ప్రపంచకప్‌ను పట్టుకున్నాడు’’అని పేర్కొన్నాడు.

రోహిత్‌ ఇన్నింగ్స్‌ చాలా కీలకం
ఇక రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ కోసం ఆర్పీ సింగ్‌ మాట్లాడూతూ.. రోహిత్‌ అడిన ఇన్నింగ్స్‌ చాలా కీలకంగా మారింది. మేము 18 ఓవర్లలో 130 పరుగులు సాధించాము. ఆ సమయంలో రోహిత్‌ అఖరి రెండు ఓవర్లలో 27 పరుగులు సాధించడంతో.. మా స్కోర్‌ బోర్డ్‌ 157 పరుగులకు చేరింది. దీంతో 158 పరుగులు చేధించడం పాక్‌ కష్టంగా మారిందిని అతడు తెలిపాడు. కాగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో రోహిత్‌ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు సాధించాడు.
చదవండిIND VS AUS: రోహిత్‌ ఆ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు: సునీల్‌ గవాస్కర్‌

మరిన్ని వార్తలు