Kohli 100th Test: కోహ్లి వందో టెస్టు..  వాట్సాప్‌ గ్రూప్‌లో రచ్చ మాములుగా లేదు

3 Mar, 2022 13:52 IST|Sakshi

టీమిండియా మెషిన్‌గన్‌ విరాట్‌ కోహ్లి వందో టెస్టు నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అదే చర్చ నడుస్తోంది. శ్రీలంకతో తొలి టెస్టు ద్వారా టీమిండియా క్రికెట్‌ చరిత్రలో వందో టెస్టు ఆడనున్న 12వ ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కనున్నాడు. మరి కోహ్లి తన చారిత్రక వందో టెస‍్టు ఆడుతున్న వేళ సహచరులు ఊరికే ఉంటారేంటి. తాజాగా తన సహచరులు రవీంద్ర జడేజా, తన్మయ్‌ శ్రీవాత్సవలు కోహ్లి గురించి తమ వాట్సాప్‌ గ్రూఫ్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. 

విషయంలోకి వెళితే.. 2008లో టీమిండియా అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అప్పటి యువ జట్టుకు కెప్టెన్‌గా కోహ్లి వ్యవహరించాడు. ఇదే జట్టులో ప్రస్తుత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. ఆ టోర్నీలో కోహ్లి 6 మ్యాచ్‌లాడి 235 పరుగులతో రాణించాడు. ఇక సౌతాఫ్రికాతో మార్చి 2, 2008న జరిగిన ఫైనల్లో తన్మయ్‌ శ్రీవాత్సవ సెంచరీతో మెరిసి జట్టు కప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

చదవండి: Mohammed Siraj: సిరాజ్‌కు ప్రమోషన్‌.. ఇకపై ఎంత జీతం అంటే!

సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత 2020లో లాక్‌డౌన్‌ సమయంలో 2008 అండర్‌-19 టీమ్‌ ఒక వాట్సాప్‌ గ్రూఫ్‌ ఏర్పాటు చేసుకుంది. అప్పటినుంచి వీరిమధ్య చాటింగ్‌ నడుస్తూనే ఉంది. తాజాగా కోహ్లి వందో టెస్టు పురస్కరించుకొని ఆ గ్రూఫ్‌లో రచ్చ లేపుతున్నారు. గ్రూఫ్‌లో మీమ్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో 2008 అండర్‌-19 టీంలో సభ్యుడైన ఇక్బాల్‌ అబ్దుల్లా కోహ్లితో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

''టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి ఇప్పుడు ఎంత అగ్రెసివ్‌గా ఉన్నాడో.. అప్పుడు అలాగే ఉండేవాడు. 2008 అండర్‌-19 వరల్డ్‌కప్‌ సందర్భంగా ఒక మ్యాచ్‌లో కోహ్లి.. ఫీల్డింగ్‌ సమయంలో నా స్థానం మార్చాడు. డీప్‌ మిడ్‌వికెట్‌లో నేను నిల్చున్నా.. అదే సమయంలో డీప్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ స్క్వేర్‌లెగ్‌ దిశగా బౌండరీ కొట్టాడు. దీంతో సహనం కోల్పోయిన కోహ్లి నాపై అరిచాడు. అయితే కొద్దిసేపటి తర్వాత నా స్థానం తనే మర్చినట్లు తెలుసుకొని క్షమాపణ చెప్పడం.. ఆ తర్వాత జరిగింది తలుచుకొని ఒకటే నవ్వుకోవడం జరిగిపోయాయి. 

మరో ఆటగాడు తన్మయ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కోహ్లిని ముద్దుగా బాయీసాబ్‌ అని పిలిచేవాళ్లం. అప్పుడు మేమంతా మ్యాచ్‌ విన్నర్లుగా నిలిచాం. ఇప్పుడు మా నుంచి కోహ్లి, జడేజాలు టీమిండియాకు ఎక్కువకాలం నుంచి ఆడుతున్నారు. జడ్డూబాయ్‌ గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. కోహ్లి వందో టెస్టు ఆడడం గొప్పగా అనిపిస్తుంది. అతని అగ్రెసివ్‌నెస్‌ను మేం తట్టుకోలేకపోయేవాళ్లం. కానీ ఒక రకంగా అతని కోపమే టీమిండియాలో స్టార్‌ను చేసింది. అని చెప్పుకొచ్చాడు.

మరో క్రికెటర్‌ ప్రదీప్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ.. '' ఆరోజుల్లో కోహ్లి, నేను ఫుడ్‌ కోసం తెగ వెతికేవాళ్లం. మేమిద్దరం మంచి ఫుడ్‌ లవర్స్‌. ముఖ్యంగా కోహ్లి మటన్‌ రైస్‌ విపరీతంగా తినేవాడు. ఆ తర్వాత తిన్నది అరిగేదాకా కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లేవాళ్లం అంటూ తెలిపాడు. ఇలా మరికొందరు క్రికెటర్లు తమ వాట్సాప్‌ గ్రూఫ్‌లో కోహ్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మార్చి 4 నుంచి మొహలీ వేదికగా తొలి టెస్టు జరగనుంది.

చదవండి: Sourav Ganguly: కోహ్లి వందో టెస్ట్‌లో సెంచరీ కొట్టాలి.. ఆ మ్యాచ్‌ చూసేందుకు నేను కూడా వస్తా..! 

Virat Kohli 100th Test: మరో 38 పరుగులు.. దిగ్గజాల సరసన

>
మరిన్ని వార్తలు