పాపం మహిళలు...

8 Aug, 2020 08:24 IST|Sakshi

దుబాయ్‌: ఎన్ని భారీ ప్రకటనలు చేసినా ఐసీసీకి మహిళల క్రికెట్‌ విషయంలో చిన్నచూపు ఉందనే విషయం మరోసారి రుజువైంది. పురుషుల ప్రపంచకప్‌ నిర్వహణతో ఏమాత్రం సంబంధం లేని మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ను కూడా అనూహ్యంగా ఏడాది పాటు వాయిదా వేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీ 2021 ఫిబ్రవరి 6 – జనవరి 7 మధ్య న్యూజిలాండ్‌లో జరగాల్సి ఉంది. దీనిని ఇప్పుడు ఐసీసీ 2022కు వాయిదా వేసింది. కరోనా సాకు కూడా దీనికి చెప్పే అవకాశం లేదు.

ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువగా కరోనా బారిన పడిన దేశాల్లో న్యూజిలాండ్‌ ఒకటి. కివీస్‌ గడ్డపై గురు, శుక్రవారాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు! అయినా సరే... ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. 2017 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులోని సభ్యులు మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కెప్టెన్‌ మిథాలీరాజ్, జులన్‌ గోస్వామిలాంటి స్టార్లు ఈ టోర్నీతో విజయవంతమైన కెరీర్‌లకు ముగింపు పలికేలా కనిపించారు. కానీ తాజా నిర్ణయం ప్రకారం మరో ఏడాది పాటు వీరు జట్టులో కొనసాగుతూ ఆటను, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అంత సులువు కాదు!.

‘ఎలాంటి పరిస్థితులనుంచైనా సానుకూలంగా తీసుకునే అంశాలు కూడా ఉంటాయి. ఈ విషయంలోనూ అంతే. ప్రణాళికకు, సన్నాహానికి మరింత సమయం దొరికింది. లక్ష్యం మాత్రం అదే 
వరల్డ్‌ కప్‌ 2022’ \మిథాలీ రాజ్, భారత వన్డే కెప్టెన్‌

మరిన్ని వార్తలు