కరోనా కలకలం.. 30 మంది అథ్లెట్లకు పాజిటివ్‌

31 Mar, 2021 21:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ 2020 సన్నాహకాల్లో భాగంగా నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) నిర్వహించిన కరోనా పరీక్షల్లో 30 మంది క్రీడాకారులు, సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పటియాల, బెంగళూరు నగరాల్లోని నేషనల్ సెంటర్స్ ఆఫ్‌ ఎక్సెల్లెన్స్‌ల్లో 741 మంది క్రీడాకారులు, సహాయ సిబ్బందికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందిలో వైరస్‌ నిర్ధారణ అయ్యింది. అయితే టోక్యో ఒలింపిక్స్ వెళ్లే ఏ అథ్లెట్‌ కూడా వైరస్‌ బారిన పడకపోవడం ఊరట కలిగించే అంశం. వైరస్‌ సోకిన వారి జాబితాలో భారత పురుషుల బాక్సింగ్ చీఫ్ కోచ్ సీఏ కుట్టప్ప, షాట్‌పుట్ కోచ్ మోహిందర్ సింగ్‌ డిల్లాన్‌ లాంటి ప్రముఖులు ఉన్నట్లు సాయ్ ప్రకటించింది.

పటియాల ఎన్‌ఐఎస్‌లో మొత్తం 313 మందికి పరీక్షలు నిర్వహించగా.. 26 మందికి పాజిటివ్‌గా తేలిందని, బెంగళూరు కేంద్రంలో 428 మందికి పరీక్షలు నిర్వహిస్తే నలుగురికి వైరస్ సోకిందని సాయ్‌ పేర్కొంది. అయితే, ఈ రెండు సెంటర్లలో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లు గానీ, కోచ్‌లుగానీ వైరస్‌ బారిన పడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మహమ్మారి బారిన పడిన బాక్సర్ల జాబితాలో ఆసియా సిల్వర్ మెడలిస్ట్ దీపక్ కుమార్, ఇండియా ఓపెన్ గోల్డ్ మెడలిస్ట్ సంజిత్ ఉన్నారు.
చదవండి: నేను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు: భజ్జీ

మరిన్ని వార్తలు