చారిత్రక మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి

20 May, 2021 19:35 IST|Sakshi

లండన్: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్‌ 18న ప్రారంభంకానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ వీక్షించేందుకు 4000 మంది ప్రేక్షకులకు అనుమతివ్వాలని హాంప్‌షైర్​కౌంటీ క్లబ్​నిర్ణయించింది. కరోనా దృష్ట్యా ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల్ని అనుమతిస్తారా లేదో అన్న సందేహాల నేపథ్యంలో హాంప్‌షైర్ కౌంటీ అధ్యక్షుడు రాడ్ బ్రన్స్ గ్రోవ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

ఈ మ్యాచ్‌ కోసం ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం టికెట్లు రిజర్వ్‌ చేయగా, మిగిలిన 2000 టికెట్లను అమ్మకానికి ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. క్రికెట్‌ చరిత్రలో మొట్టమొదటి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కావడంతో ఈ మ్యాచ్‌పై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టికెట్లకు డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే, యూకేలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో క్రికెట్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు.

హాంప్‌షైర్ వేదికగా నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభంకానుండగా, ఈ మ్యాచ్‌కు​1500 మంది ప్రేక్షకులను అనుమతించారు. 2019 సెప్టెంబర్ తర్వాత మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించడం ఇదే తొలిసారి. కాగా, భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో డబ్యూటీసీ ఫైనల్‌తో పాటు ఆతిధ్య జట్టుతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం జూన్ 2న ప్రత్యేక విమానంలో యూకేకు బయల్దేరనుంది. 
చదవండి: టీమిండియాకు ఆడేందుకు 50 మందికి పైగా రెడీగా ఉన్నారు..

మరిన్ని వార్తలు