-

ధోని వ్యవహరిస్తున్న తీరు సరైనదే

25 Sep, 2020 12:59 IST|Sakshi

ముంబై : ఎంఎస్‌ ధోని గురించి కొత్తగా ఊహించుకున్న ప్రతీసారి ఏదో ఒక నిర్ణయంతో తన అభిమానులకు షాక్‌లు ఇస్తూనే ఉంటాడు. 2019లో జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఆఖరిసారిగా ఆడిన ధోని మళ్లీ బరిలోకి దిగలేదు. ఇంతలోనే కరోనా రావడం.. దీంతో ఐపీఎల్‌, టీ20 క్రికెట్‌లు వాయిదా పడడం ధోనిని అతని అభిమానులకు మరింత దూరం చేశాయి. అలా చూస్తుండగానే 14 నెలలు గడిచిపోయాయి. అయితే టీ20 ప్రపంచకప్‌లో ధోని ఆడుతాడని భావించిన అతని అభిమానులకు ధోని బిగ్‌షాక్‌ ఇచ్చాడు. అదే రిటైర్మెంట్‌ అనే పదం..సరిగ్గా ఆగస్టు 15 రాత్రి 7.29 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. (చదవండి : సాకులు చెప్పడం ధోనికి మాత్రమే చెల్లుతుంది)

దీంతో షాక్‌కు గురైన అతని అభిమానులు ఐపీఎల్‌ 13వ సీజన్‌లో తన మెరుపులు చూడొచ్చులే అనుకొని సర్థిచెప్పుకున్నారు. తీరా ఐపీఎల్‌ ప్రారంభం అయ్యాకా ధోని బ్యాటింగ్‌ వీక్షించే అవకాశం గడిచిన రెండు మ్యాచ్‌ల్లో మనకు కనిపించలేదు. అంతేగాక ఏడో స్థానంలో బ్యాటింగ్‌ వస్తూ అందరిని నిరాశపరిచాడు. మొదటి మ్యాచ్‌లో చివర్లో శామ్‌ కర్జన్‌ గర్జనతో ధోనికి బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాలేదు.   ఇక రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఏడో స్థానంలో వచ్చిన ధోని క్రీజులో కుదురుకున్నాకా మూడు సిక్స్‌లు బాదినా అవి జట్టును గెలిపించలేకపోయా. ఇప్పుడు ధోని ఏడో స్థానంలో రావడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఏడో స్థానంలో బ్యాటింగ్‌ రావడం పట్ల ధోని కారణం వివరించినా.. ఒక అనుభవజ్ఞుడు చేయాల్సిన పని కాదని పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోశారు. అయితే టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం ధోని ఈ విషయంలో కరెక్ట్‌గానే వ్యవహరిస్తున్నాడంటూ అతనికి మద్దతు పలికాడు. ఈఎస్‌పీఎన్‌ ఇంటర్య్వూలో ఆకాశ్‌ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : కోహ్లి ఎందుకిలా చేశావు..)

'ధోని వ్యవహరిస్తున్న తీరు సరిగానే ఉంది. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నిజానికి ధోని 14 నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 14 నెలల తర్వాత ప్రాక్టీస్‌ చేసినా అది కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ఆడుతున్న ధోని.. వచ్చీ రాగానే బ్యాట్‌కు ఎలా పని చెప్పగలడు. అందుకే తనను తాను బ్యాటింగ్‌లో డిమోషన్‌ కల్పించుకొని ఏడో స్థానంలో వస్తున్నాడు. అంతేగాక దుబాయ్‌కు చేరుకోగానే నేరుగా ప్రాక్టీస్‌ చేయకుండా క్వారంటైన్‌లో ఉండడంతో అతనికి ఎక్కువ ప్రాక్టీస్‌ చేసే అవకాశం లేదు.. అందుకే ఏడో స్థానం అనే నిర్ణయం తీసుకున్నాడు. అయినా ధోని నిర్ణయాలు ఎప్పుడు షాకింగ్‌గానే కనిపిస్తాయి.

ధైర్యసాహసాలు, మూర్ఖత్వం మధ్య ఒక సన్నని గీత.. అలాగే జాగ్రత్త, భయం అనే పదాలను వేరు చేసే సన్నని గీతలను  కెప్టెన్‌గా ధోని ఎప్పుడో దాటేశాడు. ఐపీఎల్‌ తొలిదశలోనే ధోని నిర్ణయాలను తప్పుబట్టడం సరికాదు. కేవలం ఒక మ్యాచ్‌ గెలిపించలేకపోయాడనే సాకుతో ధోనిని విమర్శించడం తప్పు.. అతని నాయకత్వ పటిమ ఎప్పటికి చెరిగిపోదు. ధోని తన నిర్ణయాలను ఇప్పుడిప్పుడే అమలు చేస్తున్నాడు.. అయినా ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని మూడు సిక్సర్లు కొట్టాడంటే అతను ఫామ్‌లో ఉన్నట్లే.. కానీ అప్పటికే చేదించాల్సిన స్కోరు అమాంతం పెరిగిపోయింది. అందుకే తనకు తాను ఫామ్‌లో వచ్చినప్పుడు సహజంగానే ధోని తనకు కలిసి వచ్చిన స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును గెలిపించే ప్రయత్నం చేస్తాడు. అప్పటివరకు వేచి చూద్దాం. అంటూ తెలిపాడు. కాగా నేడు(శుక్రవారం) చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు