Kohli- Rohit: కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్‌ శర్మ అలా కాదు! అతడు ఉన్నాడంటే..

16 Aug, 2022 13:57 IST|Sakshi
రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి(PC: AP)

Aakash Chopra On Virat Kohli And Rohit Sharma Captaincy: విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ గురించి టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో కోహ్లి దూకుడుగా ఉంటాడని.. అయితే అతడి సారథ్యంలోని జట్టులో మాత్రం అలాంటి లక్షణాలు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు.

టెస్టు క్రికెట్‌లో తనదైన కెప్టెన్సీతో నిబంధనలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన కోహ్లి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం అదే స్థాయిలో జట్టును ముందుకు నడిపించలేకపోయాడని వ్యాఖ్యానించాడు. అయితే, రోహిత్‌ శర్మ మాత్రం కోహ్లిలా కాదని.. అతడి నేతృత్వంలో జట్టు దూకుడుగా ఆడుతోందని పేర్కొన్నాడు.

కోహ్లి అలా.. రోహిత్‌ ఇలా!
కాగా పలువురు టీమిండియా కెప్టెన్ల శైలి గురించి ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.  ఈ సందర్భంగా కెప్టెన్‌గా కోహ్లి, రోహిత్‌ శర్మ మధ్య భేదాల గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో కోహ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది నేను చేయాలని అని విరాట్‌ కోహ్లి అనుకుంటే కచ్చితంగా చేసి తీరాల్సిందే అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. మైదానంలో అత్యంత దూకుడుగా కనిపిస్తాడు.

ప్రత్యర్థి ఎవరైనా.. పరిస్థితులు ఎలాంటివైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్లుగా ముందుకు సాగుతాడు. కానీ.. ఎందుకో అతడి సారథ్యంలోని జట్టు మాత్రం ఇలా ఉండేది కాదు. కోహ్లి కెప్టెన్సీలోని జట్టులో ఇలాంటి దూకుడు ఎప్పుడూ చూడలేదు’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

కోహ్లి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో జట్టు సభ్యులు విఫలమైనందు వల్లే కొన్నిసార్లు అనవసర తప్పిదాలు చేసేవారంటూ ఛతేశ్వర్‌ పుజారా ఓ మ్యాచ్‌లో రెండుసార్లు రనౌట్‌ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

టెస్టు కెప్టెన్సీ వేరే లెవల్‌.. కానీ
ఇక టెస్టుల్లో విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ గురించి చెబుతూ.. ‘‘కోహ్లి ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేవాడు. నా అభిప్రాయం ప్రకారం అతడు నిబంధనలకు సరికొత్త నిర్వచనం ఇస్తూ ముందుకు సాగేవాడు. కెప్టెన్‌గా తన దూకుడు అలాంటిది. కానీ ముందు చెప్పినట్లుగా జట్టులో మాత్రం ఇలాంటి లక్షణాలు కనిపించేవి కావు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. 

ఇక టెస్టు క్రికెట్‌లో ప్రతిభావంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్న కోహ్లి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం దూకుడైన సారథిగా తనదైన ముద్ర వేయలేకపోయాడని పేర్కొన్నాడు. బ్యాటర్‌గా ఎప్పుడూ దూకుడు ప్రదర్శించే కోహ్లి సారథ్యంలోని జట్టు మాత్రం దూకుడుగా ఉండేది కాదన్న ఆకాశ్‌ చోప్రా.. కేవలం టీమిండియా మాత్రమే కాకుండా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ ఇలాంటి పరిస్థితిని చూశామని చెప్పుకొచ్చాడు.  

రోహిత్‌ ఉంటే ఆటగాళ్లు చెలరేగిపోతారు!
అయితే, రోహిత్‌ శర్మ మాత్రం కోహ్లిలా మైదానంలో దూకుడు ప్రదర్శించడని.. అదే సమయంలో జట్టులో మాత్రం ఆత్మవిశ్వాసం నింపి వారికి ధైర్యాన్నిస్తాడన్నాడు. కెప్టెన్‌ అండతో ఆటగాళ్లు దూకుడుగా ఆడతారని చెప్పుకొచ్చాడు. 

కాగా భారత సారథిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్న కోహ్లి.. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా జట్టును ఒక్కసారి కూడా విజేతగా నిలపలేకపోయాడు.

మరోవైపు.. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్‌ సారథ్యంలోని పరిమిత ఓవర్ల జట్టు అద్భుత విజయాలు నమోదు చేస్తోంది. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌ సారథిగా జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్‌ శర్మకు ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చదవండి: Asia Cup 2022: నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టికెట్లు.. ఒకేసారి 7.5 లక్షల మంది దండయాత్ర

మరిన్ని వార్తలు