ఓపెనర్‌గా పంత్‌ వద్దు.. అతడిని పంపండి! విధ్వంసం సృష్టిస్తాడు

19 Nov, 2022 20:27 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత టీమిండియా కెప్టెన్సీ, ఓపెనింగ్‌ స్థానాల పైన తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. భారత టీ20 కెప్టెన్సీ నుంచి  రోహిత్‌ను తప్పించి హార్దిక్‌కు బాధ్యతలు అప్పజెప్పాలని పెద్ద సంఖ్యలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు టీ20ల్లో భారత ఓపెనర్‌గా రిషబ్‌ పంత్‌ను పంపాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భారత వెటరన్‌ ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ కూడా పంత్‌ను టీ20ల్లో ఓపెనింగ్‌ పంపాలని సూచించాడు.

ఇక ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు ఆకాష్‌ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఒక వేళ రోహిత్‌ జట్టుకు దూరమైతే  భారత ఓపెనర్‌గా రిషబ్‌ పంత్‌ను ఫస్ట్‌ చాయిస్‌గా భావించకూడదని ఆకాష్‌ చోప్రా అన్నాడు.

చోప్రా  తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం భారత జట్టుకు ఒక విధ్వంసకర ఓపెనర్‌ అవసరం. పృథ్వీ షా రూపంలో టీమిండియాకు అద్భుతమైన అవకాశం ఉంది. అతడు విధ్వంసకర ఆటగాడు. పవర్‌ ప్లే జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించగలడు. కానీ అతడు ఫిట్‌గా లేడు, ఓపెనర్‌గా పనికిరాడని కొంతమంది భావిస్తున్నారు.

దేశీవాళీ క్రికెట్‌లో ఓపెనర్‌గా అతడి రికార్డులు చూసి మాట్లాడాలి. అయితే ప్రతీ మ్యాచ్‌లోనూ చేలరేగుతాడని నేను చెప్పడం లేదు. బట్లర్‌, హేల్స్‌ వంటి వారు కూడా ప్రతీ మ్యాచ్‌లోనూ దూకుడుగా ఆడలేరు కదా.

పృథ్వీ మీ దృష్టిలో లేకపోతే, ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వండి. అతడు కూడా విధ్వంసక బ్యాటర్. ఒక్క సారి క్రీజులో నిలదొక్కకుంటే చెలరేగి ఆడుతాడు. అంతే తప్ప పంత్‌ను మాత్రం ఫస్ట్‌ ఛాయిస్‌ ఓపెనర్‌గా భావించకూడదు" అని పేర్కొన్నాడు.
చదవండి: Rishabh Pant: రానున్న పదేళ్లలో టీ20 క్రికెట్‌లో పంత్‌దే హవా.. జట్టులో కీలక ప్లేయర్‌గా..

మరిన్ని వార్తలు