‘టెస్టు మ్యాచ్‌లు ఆడటం ఇక అనుమానమే’

28 Aug, 2020 12:06 IST|Sakshi

నా టెస్టు కెరీర్‌ ముగిసినట్లే: ఫించ్‌

డెర్బీ: ఆస్ట్రేలియా తరఫున టెస్టు మ్యాచ్‌ల్లో ఆడేది అనుమానమేనని వన్డే కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అన్నాడు. దాదాపుగా తన టెస్టు కెరీర్‌ ముగిసినట్లేనని వ్యాఖ్యానించాడు. 3 వన్డేలు, 3టి20 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న ఫించ్‌... కెరీర్‌ ముగిసేలోగా చివరగా ఒక టెస్టు మ్యాచ్‌ ఆడాలని ఉందంటూ తన ఆసక్తిని బయట పెట్టాడు. భారత్‌లో 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌ తనకు చివరి సిరీస్‌ అవుతుందని చెప్పాడు. ‘నేనింకా టెస్టులు ఆడే అవకాశం ఉందని అనుకోవట్లేదు. ఎరుపు బంతితో ఆడతానని చెప్తే అది అబద్ధమే అవుతుంది. టెస్టు జట్టులో చోటు కోసం ఇప్పట్లో నేను ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడలేను. మరోవైపు యువకులు దూసుకొస్తున్నారు. టాపార్డర్‌లో ఇమిడిపోయే యువకులే అధికంగా వెలుగులోకి వస్తున్నారు’ అని ఫించ్‌ చెప్పాడు. ఇప్పటివరకు కేవలం 5 టెస్టుల్లోనే ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన 33 ఏళ్ల ఫించ్‌... 126 వన్డేలు, 61 టి20లు ఆడాడు.  
(చదవండి: ఊహించని ట్విస్ట్‌.. పాపం కెవిన్‌ ఒబ్రెయిన్‌)

>
మరిన్ని వార్తలు