'మేం బాగానే ఉ‍న్నాం.. మీ పని చూసుకోండి'

27 Feb, 2021 18:39 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ తాజగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 12 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. దీంతో ఫించ్‌ దంపతులను టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో కొంతమంది తప్పుడు ట్రోల్స్‌ చేశారు. అంతేగాక ఫించ్‌ భార్య ఎమీపై లైంగిక వేధింపులతో పాటు అసభ్యకరమైన సందేశాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై ఫించ్‌ భార్య ఎమీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమను ట్రోల్‌ చేసిన వారిపై మండిపడింది.


'ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గులేదా. దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడండి.. అంతేకాని ఇలా అసభ్య సందేశాలు పంపించి మీ పరువు తీసుకోకండి. నా భర్త ఒక్క మ్యాచ్‌లో సరిగా ఆడనందుకు ఇలాంటి చెత్త విమర్శలు చేస్తారా? ఫించ్‌ ఆటగాడిగా ఇప్పటికే ప్రూవ్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్నాడు. అతని ఆటతీరును తప్పుపట్టేందుకు మీకు అర్హత లేదు. అయినా మా వైవాహిక జీవితంలో మేం బాగానే ఉన్నాం.. ఇలాంటి పనికిమాలిన పోస్టులు పెట్టేకంటే మీ పని చూసుకుంటే బాగుంటుంది.'అంటూ హెచ్చరించింది.

ఆరోన్‌ ఫించ్‌ ఆస్ట్రేలియా తరపున 132 వన్డేల్లో 5232 పరుగులు, 68 టీ20ల్లో 2162 పరుగులు, 5 టెస్టుల్లో 278 పరుగులు చేశాడు.కాగా కివీస్‌తో సిరీస్‌కు ముందు ఫించ్‌ 29 టీ20 మ్యాచ్‌లాడి 495 పరుగులు సాధించాడు. వీటిలో ఐపీఎల్‌, బిగ్‌బాష్‌ సహా పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక కివీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్‌ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 బుధవారం వెల్లింగ్‌టన్‌లో జరగనుంది.
చదవండి: 'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి'
మహిళా క్రికెటర్‌తో ట్వీటర్‌ క్లాష్‌: ఈసీబీ వార్నింగ్‌

మరిన్ని వార్తలు