ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన డివిలియర్స్‌

7 Nov, 2020 16:38 IST|Sakshi

అబుదాబి: అద్భుత బ్యాటింగ్‌​ లైనప్‌ కలిగిన రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు అనూహ్యంగా ఐపీఎల్‌ 2020 నుంచి వైదొలిగింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఏబీ డివిలియర్స్‌ నిన్నటి మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. ఆరోన్‌ ఫించ్‌ (30 బంతుల్లో 32, 3 ఫోర్లు, ఒక సిక్స్‌) సాయంతో డివిలియర్స్‌ (43 బంతుల్లో 56, ఐదు ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 131 పరుగులు మాత్రమే చేసింది.

ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్ల దెబ్బకు మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ కోహ్లి, ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌తో సహా మొయిన​ అలీ, శివం దుబే, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైనీ సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌ చేరారు. పేసర్‌ మహ్మద్‌ సిరాట్‌ 10 పరుగులు చేశాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ డేవిడ్‌ వార్నర్‌, మనీష్‌ పాండే తక్కువ పరుగులకే ఔటైనా..  కేన్‌ విలియమ్సన్‌ (44 బంతుల్లో 50 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జేసన్‌ హోల్డర్‌ (20 బంతుల్లో 24 పరులు, మూడు ఫోర్లు) బాధ్యాయుత ఆటతో విజయం సాధించింది. ఇక కీలకమైన మ్యాచ్‌లో ఆర్సీబీ బోల్తా పడటంతో అటు ఆటగాళ్లు, ఇటలు అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
(చదవండి: కన్ఫ్యూజ్‌ చేసిన డివిలియర్స్‌!)

ఇప్పటివరకు ఐపీఎల్‌ ట్రోఫీ కలగానే మిగిలిపోవడం పట్ల భారమైన హృదయంతో టోర్నీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా ఏబీ డివిలియర్స్‌ అభిమానుల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపాడు. అదే సమయంలో బాగా ఆడి అభిమానులను అలరించినప్పటికీ.. అంచనాలు అందుకోలేకపోయామని క్షమాపణలు కూడా కోరాడు. చిరస్మరణీయ పోటీ నుంచి నిరాశగా తప్పుకుంటున్నామని ఆర్సీబీ యాజమాన్యం ట్వీట్‌ చేసింది. ఆటగాళ్ల ఫేర్‌వెల్‌ వీడియోను షేర్‌ చేసింది. ఇదిలాఉండగా.. తాజా సీజన్‌లో 454 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్‌ అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. 15 మ్యాచ్‌లో మూడు అర్ధ సెంచరీలు చేసిన ఏబీ 158.7 స్ట్రయిక్‌రేట్‌తో ఈ ఘనత సాధించాడు.
(చదవండి: ఆర్సీబీ ఔట్‌.. కోహ్లి ఎమోషనల్‌ ట్వీట్‌!)

మరిన్ని వార్తలు