మూడోసారి తండ్రైన ఏబీ డివిల్లియర్స్‌

20 Nov, 2020 21:01 IST|Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిల్లియర్స్‌ మూడోసారి తండ్రయ్యాడు. అతడి భార్య డేనియల్‌ ఈనెల 11న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో భార్యాపిల్లలతో కలిసి ఉన్న ఫొటోను డివిల్లియర్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. పాపకు యెంటేగా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ మేరకు ‘‘11-11-2020న అందమైన పాపాయి యెంటే డివిల్లియర్స్‌కు స్వాగతం పలికాం. నీ రాకతో మన కుటుంబం పరిపూర్ణమైంది. నిన్ను ప్రసాదించినందుకు ఆ దేవుడికి మేం ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం’’ అని క్యాప్షన్‌ జతచేశాడు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా డివిల్లియర్స్‌ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి: అలా సెహ్వాగ్‌ వార్తల్లో ఉంటాడు: మాక్స్‌వెల్‌ )

కాగా ఐదేళ్లపాటు డేటింగ్‌ చేసిన అనంతరం 2013లో డివిల్లియర్స్‌- డేనియల్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమారులు అబ్రహం జూనియర్‌, జాన్‌ ఉన్నారు. ఇక ఇప్పుడు కూతురు జన్మించడంతో డివిల్లియర్స్‌ దంపతులు ఆనందంలో మునిగిపోయారు. కాగా ఐపీఎల్‌-2020 సీజన్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు తరఫున మైదానంలో దిగిన టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవకపోవడంతో అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోగా.. డివిల్లియర్స్‌ వారి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు చెబుతూనే, అదే సమయంలో అంచనాలు అందుకోలేకపోయామని క్షమాపణ కూడా కోరాడు. 

A post shared by AB de Villiers (@abdevilliers17)

>
మరిన్ని వార్తలు