ఈ పిచ్‌లోనూ అంతే.. టెస్ట్‌ మ్యాచ్‌ ఇక..

3 Mar, 2021 03:55 IST|Sakshi

చివరి టెస్టుపై అజింక్య రహానే వ్యాఖ్య

మళ్లీ స్పిన్‌ పిచ్‌గా సంకేతాలు

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగే చివరి టెస్టులోనూ స్పిన్‌కు బాగా అనుకూలించే పిచ్‌నే టీమిండియా కోరుకుంటోంది. గత రెండు టెస్టుల తరహాలోనే ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు ఇది సరైన వ్యూహమని భావిస్తోంది. భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చాయి. నాలుగో టెస్టులో కూడా స్పిన్‌ పిచ్‌ ఎదురవుతుందని, అంతా సన్నద్ధంగా ఉండాలని రహానే పిలుపునిచ్చాడు. ‘నాకు తెలిసి రెండో, మూడో టెస్టుల్లో ఎలాంటి పిచ్‌పై ఆడామో ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి పిచ్‌ సిద్ధమవుతోంది. కచ్చితంగా అది స్పిన్‌కు అనుకూలిస్తుంది.

గత మ్యాచ్‌లో గులాబీ బంతి కొంత భిన్నంగా స్పందించింది కాబట్టి బ్యాటింగ్‌లో కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. స్పిన్‌ పిచ్‌లపై నేరుగా లైన్‌లోనే ఆడాల్సి ఉంటుంది. బంతి బాగా స్పిన్‌ అయితే మాత్రం సమస్యే లేదు. ఒక్కో బ్యాట్స్‌మన్‌ శైలి ఒక్కోలా ఉంటుంది. ఫ్రంట్‌ ఫుట్‌ లేదా బ్యాక్‌ ఫుట్‌ ఎలా ఆడినా కాళ్ల కదలికలు చాలా ముఖ్యం. టర్న్‌ ఎక్కువగా ఉంటే మీ డిఫెన్స్‌ను నమ్ముకోవాలి. స్పిన్నింగ్‌ పిచ్‌పై ఆడటం సవాలే కావచ్చు కానీ దానినీ అధిగమించవచ్చు’ అని రహానే విశ్లేషించాడు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా ఇంగ్లండ్‌ జట్టును తాము తక్కువగా అంచనా వేయడం లేదని అతను స్పష్టం చేశాడు. మరోవైపు స్పిన్‌ పిచ్‌లపై ఇంగ్లండ్‌ మీడియా నుంచి వస్తున్న విమర్శలకు కూడా రహానే సమాధానమిచ్చాడు. ‘ఏమైనా మాట్లాడుకునే హక్కు జనాలకు ఉంది. మేం విదేశాల్లో ఆడినప్పుడు సీమింగ్‌ పిచ్‌ల గురించి ఎవరూ మాట్లాడరు. ఒక్కోసారి పచ్చికతో పిచ్‌ అనూహ్యంగా స్పందించినప్పుడు కూడా మేం ఫిర్యాదు చేయలేదు. అసలు దాని గురించి ఎప్పుడూ మాట్లాడనే లేదు’ అని రహానే వ్యాఖ్యానించాడు. 

మరిన్ని వార్తలు