'ఆ విజయం మాకు వరల్డ్‌కప్‌తో సమానం'

2 Mar, 2021 22:11 IST|Sakshi

అహ్మదాబాద్‌: లార్డ్స్‌లో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ గెలవడం మాకు ప్రపంచకప్‌తో సమానమని టీమిండియా క్రికెటర్‌ అజింక్య రహానే పేర్కొన్నాడు. నాలుగో టెస్టుకు సన్నద్ధమవుతున్న వేళ ఇషాంత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ రహానే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

''ఇషాంత్‌ చెప్పింది నిజం. మేము నాలుగో టెస్టు గెలవడంతో పాటు లార్డ్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నాం. టెస్టు చాంపియన్‌ విజయం మాకు వరల్డ్‌కప్‌తో సమానం. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో విజయం సాధించడం చాలా అవసరం. మూడో టెస్టులో పిచ్‌ ఏ విధంగా ఉందో చివరి టెస్టుకు కూడా అలాగే ఉంటుంది.. ఇందులో ఏ మార్పు ఉండదు. అయితే పిచ్‌ స్పిన్‌కు అనూకూలిస్తుందని ఇంగ్లండ్‌ ఆరోపించడం సరికాదు. ఎందుకంటే వాళ్ల జట్టు  స్పిన్నర్లు కూడా వికెట్లు తీశారు. అయితే పింక్‌ బాల్‌ టెస్టులో బౌలర్లకు అనుకూలించిన పిచ్‌ డే టెస్టు అయిన నాలుగో మ్యాచ్‌కు సహకరిస్తుందని చెప్పలేం.

అయినా మేం విమర్శలు పట్టించుకునేంత సమయం లేదు. రెండు టెస్టుల్లో వరుసగా ఓడినంత మాత్రానా ఇంగ్లండ్‌ను తేలిగ్గా తీసుకునే ప్రసక్తి లేదు. ఈ మ్యాచ్‌లో గెలవడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం.నా ఫామ్‌పై పలువురు కామెంట్స్‌ చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. ఆసీస్‌తో సిరీస్‌ నుంచి నా గణాంకాలు ఒక్కసారి పరిశీలించండి. జట్టుకు అవసరమైనప్పుల్లా నా వంతు సహకారం అందిస్తూనే ఉన్నానంటూ'' చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటికే కోహ్లి సేన నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ గురువారం(మార్చి 4) నుంచి జరగనుంది.
చదవండి:
'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్‌ సూపర్‌'
ఐసీసీ అవార్డు రేసులో ముగ్గురు.. విజేత ఎవరో!

మరిన్ని వార్తలు