పొలార్డ్‌ విధ్వంసం.. హ్యాట్రిక్‌ సంతోషం కాసేపైనా

4 Mar, 2021 13:32 IST|Sakshi

ఆంటిగ్వా: వెస్టిండీస్‌, శ్రీలంక మధ్య గురువారం తొలి టీ20 మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. అయితే పొలార్డ్‌ రికార్డు ముందు రెండో రికార్డ్‌ పాపులర్‌ అవలేదు. అసలు విషయంలోకి వెళితే.. విండీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో శ్రీలంక స్పిన్నర్‌ అఖిల ధనుంజయ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు.

ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ వేసిన ధనుంజయ మూడు వరుస బంతుల్లో ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌(28 పరుగులు), క్రిస్‌ గేల్‌( 0 పరుగులు), నికోలస్‌ పూరన్‌(0 పరుగులు)లను ఔట్‌ చేసి ఈ ఫీట్‌ సాధించాడు. తద్వారా లంక తరపున హ్యాట్రిక్‌ సాధించిన మూడో బౌలర్‌గా ..ఓవరాల్‌గా 13వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు లంక నుంచి లసిత్‌ మలింగ రెండుసార్లు(2017,2019), తిసారా పెరీరా( 2016) హ్యాట్రిక్‌ను నమోదు చేశారు. అయితే హ్యాట్రిక్‌ తీసిన ఆనందం ధనుంజయకు ఎంతోసేపు నిలవలేదు.

విండీస్‌ విధ్వంసం కీరన్‌ పొలార్డ్‌ ధనుంజయ బౌలింగ్‌లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా.. అదే విధంగా టీ20ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా పొలార్డ్‌ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ పొలార్డ విధ్వంసంతో 13.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌లో విండీస్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 5న ఆంటిగ్వా వేదికలోనే జరగనుంది.
చదవండి: 
రెచ్చిపోయిన పొలార్డ్‌.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు

మరిన్ని వార్తలు