Deepika Kumari:10 ఏళ్ల క్రితమే నంబర్‌వన్‌.. మరి ఒలింపిక్స్‌ పతకం?

24 Jul, 2021 11:32 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: దీపికా కుమారి.. మహిళా ఆర్చరీ నంబర్‌వన్‌ ప్లేయర్‌.  ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌కు భారత్‌ తరఫున అడుగుపెట్టిన ఏకైక మహిళా ఆర్చరీ క్రీడాకారిణి. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు దీపికా సొంతం.. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం ఇప్పటివరకూ ఆమె ఖాతాలో పతకం కూడా లేదు. ఈసారి కోటి ఆశలతో టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన దీపికా కుమారి.. కచ్చితంగా పతకం సాధించాలనే లక్ష్యంతో  పోరుకు సిద్దమైంది. వరల్డ్‌నంబర్‌వన్‌ ట్యాగ్‌తో ఒలింపిక్స్‌ విలేజ్‌కు వెళ్లిన దీపిక పతకం సాధిస్తుందనే అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

అంచనాలకు తగ్గట్టు రాణించలేదు..
టోక్యో ఒలింపిక్స్‌ తొలి రోజు శుక్రవారం(23-07-2021)తొలి రోజు క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మాత్రం దీపికా అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. వరల్డ్‌నంబర్‌గా బరిలోకి దిగిన దీపిక తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. తొలి హాఫ్ సమయానికి 4వ స్థానంలో నిలిచిన దీపిక.. మిగిలిన హాఫ్‌ సమయంలో పలుమార్లు గురి కోల్పోయి మొత్తం రౌండ్ ముగిసే సరికి 663 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయింది. క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసే సరికి టాప్ 3లో సౌత్ కొరియా ఆర్చర్లే ఉండటం గమనార్హం. జులై 28 నుంచి ప్రారంభం కానున్న రౌండాఫ్- 32 ఎలిమినేషన్ రౌండ్స్‌లో దీపిక తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

10 ఏళ్ల క్రితమే వరల్డ్‌ నంబర్‌వన్‌.. 
2005లో ఖర్సావన్‌ పట్టణంలోని అర్జున్‌ ఆర్చరీ అకాడమీలో... కొన్నాళ్ల తర్వాత జమ్‌షెడ్‌పూర్‌లోని టాటా ఆర్చరీ అకాడమీలో దీపిక శిక్షణ తీసుకుంది. 2009లో 15 ఏళ్ల ప్రాయంలో అమెరికాలో జరిగిన ప్రపంచ యూత్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దీపిక స్వర్ణ పతకాన్ని నెగింది.  ఆ తర్వాత దీపిక వెనుదిరిగి చూడలేదు. 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌లో దీపిక రికర్వ్‌ వ్యక్తిగత, మహిళల టీమ్‌ విభాగాల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది.  అంటే సుమారు 10 ఏళ్ల క్రితమే దీపిక వరల్డ్‌నంబర్‌గా నిలవగగా, 2012లో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌కు టాప్‌ సీడ్‌గా వెళ్లారు.

ఇక్కడ చదవండి: Tokyo Olympics 2020: భారత్‌ ఎన్ని పతకాలు గెలుస్తుంది?!



ఒలింపిక్స్‌ ముందు గోల్డెన్‌ హ్యాట్రిక్‌
టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పాల్గొన్న చివరి టోర్నమెంట్‌లో భారత మహిళా మేటి ఆర్చర్‌ దీపిక కుమారి అదరగొట్టింది. ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నమెంట్‌లో దీపిక ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది.   ఐదు గంటల వ్యవధిలో దీపిక నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటా విజయం సాధించింది.  తద్వారా ఒకే ప్రపంచకప్‌ టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం వరల్డ్‌ నంబర్‌వన్‌గా కొనసాగుతున్న దీపికా కుమారి.. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది.

ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో భారత్‌కు పతకం రాలేదు. ప్రధానంగా ఒలింపిక్స్‌ వంటి మెగా ఈవెంట్‌లలో విఫలం అవుతున్న దీపికా.. ఆ అడ్డంకిని అధిగమించాలనే పట్టుదలతో ఉంది.  2012 లండన్‌ ఒలింపిక్స్‌ లో రౌం‍డ్‌ 16ను దాటలేకపోయిన దీపిక.. 2016  రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌ను దాటి ముందుకు వెళ్లలేకపోయింది. ఈసారి పతకమే లక్ష్యంగా పోరుకు సిద్దమైన దీపిక ఎలా రాణిస్తుందో చూడాలి. 

>
మరిన్ని వార్తలు