ఇక... అమెజాన్‌ ప్రైమ్‌ క్రికెట్‌

11 Nov, 2020 08:03 IST|Sakshi

న్యూజిలాండ్‌ క్రికెట్‌కు సంబంధించి ఆరేళ్ల హక్కులు కైవసం

ఇందులో భారత్‌వి రెండు సిరీస్‌లు

ముంబై: భారత్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మరో దశకు చేరనుంది. ఇన్నాళ్లు తమ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై బహుభాష వెబ్‌ సిరీస్‌లు, సీరియళ్లు, సినిమాలతో అలరించిన ‘ప్రైమ్‌ వీడియో’ ఇకపై ప్రత్యక్ష క్రికెట్‌ ప్రసారాలకు సిద్ధమైంది. భారత్‌లో క్రికెట్‌ క్రేజీని కూడా సొంతం చేసుకునేందుకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ హక్కుల్ని చేజిక్కించుకుంది. కివీస్‌ గడ్డపై జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రైమ్‌ వీడియో ప్రసారం చేయనుంది. ఈ నెలలో మొదలయ్యే 2020-21 సీజన్‌ నుంచి 2025-26 సీజన్‌ వరకు ఆరేళ్ల పాటు జరిగే క్రికెట్‌ సిరీస్‌లను భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో... న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు (ఎన్‌జెడ్‌సీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆరేళ్ల ఒప్పందంలో రెండు భారత్‌ పర్యటనలు కూడా ఉన్నాయి. 

2022లో ఒకసారి, తదనంతరం మరోసారి టీమిండియా... న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ ఒప్పందంపై ప్రైమ్‌ వీడియో డైరెక్టర్‌, జనరల్‌ మేనేజర్‌ (ఇండియా) గౌరవ్‌ గాంధీ మాట్లాడుతూ ‘భారత్‌లో గత కొన్నేళ్లుగా ప్రపంచ శ్రేణి వినోదానికి ప్రైమ్‌ వీడియో ఒక కేంద్రమైంది. భారతీయ భాషల్లో అమెజాన్‌ ఒరిజినల్‌ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో కోట్ల మంది ఆదరణ చూరగొంది. ఇప్పుడు క్రికెట్‌ కూడా ప్రసారం చేయనుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు. న్యూజిలాండ్‌ బోర్డుతో కుదిరిన ఈ ఒప్పందంతో ఇకపై భారత్‌లో క్రికెట్‌ అభిమానులకు కూడా ప్రైమ్‌ వీడియో దగ్గరవుతుందని చెప్పారు. ఎన్‌జెడ్‌సీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డేవిడ్‌ వైట్‌ మాట్లాడుతూ ‘బోర్డు లక్ష్యాల్లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఆదరణ విశ్వవ్యాప్తం చేయాలనేది కీలకమైంది. ఆ దిశగా సంబంధాలు పెంచుకునేందుకు అనుబంధమైన భాగస్వామ్యాలతో జతకడుతోంది. భారత్‌లో క్రికెట్‌కున్న ఆదరణ అందరికి తెలుసు. ఇప్పుడు దీన్ని పొందేందుకే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు