IPL 2022- Ambati Rayudu: ఐపీఎల్-2022 సీజన్కు ముందు మెగా వేలం మరి కొద్ది రోజులో జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్ల రీటైన్ జాబితాను ఆయా ఫ్రాంచైజీలు ప్రకటించాయి. కాగా చాలా మంది స్టార్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోలేదు. దీంతో రానున్న మెగా వేలానికి ప్రాధన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు అంబటి రాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఐపీఎల్-2022 సీజన్కు సీఎస్కే రాయుడిని రీటైన్ చేసుకోలేదు. అయితే, తనకు మాత్రం ఐపీఎల్లో మరో మూడేళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడాలని ఉందని రాయుడు మనసులోని మాటను బయటపెట్టాడు. రాబోయే వేలంలో సీఎస్కే తనని కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నాని రాయుడు తెలిపాడు.
"సీఎస్కే తరుపున ఆడటానికి చాలా ఇష్టపడతాను. నాకైతే ఇప్పటివరకు జట్టు నుంచి ఎటువంటి సమాచారం లేదు. అయితే మరోసారి నన్ను కొనుగోలు చేస్తారని భావిస్తున్నాను. అదే విధంగా 2021 సీజన్లో విజయం మాకు చాలా ప్రత్యేకమైనది. అంతేకాకుండా ఈ విజయంలో నా వంతు పాత్ర పోషించాను. నేను ఏంటో నిరూపించుకోవడానికి సీఎస్కే నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. జట్టులో ఏ స్దానంలోనైనా ఆడటానికి సిద్దంగా ఉన్నాను. మెగా వేలంలో యువ ఆటగాళ్ల కోసం ఎక్కువ పోటీ ఉంటుంది. ఈ ఏడాది వేలం ఆసక్తికరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2021 సీజన్లో రాయుడు 257 పరుగులు సాధించాడు.