‘కోహ్లికి కాదు.. మా బ్యాట్స్‌మన్‌కే కష్టం’

26 Nov, 2020 15:22 IST|Sakshi

కరాచీ: టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు బౌలింగ్‌ చేయడాన్ని తాను ఎక్కువగా ఇష్టపడతానని పాకిస్తాన్‌ పేసర్‌ మహ్మద్‌ అమిర్‌  పేర్కొన్నాడు.  ఆ ఇద్దరితో కలిసి క్రికెట్‌ ఆడాలని అనుకుంటున్నాని పేర్కొన్న అమిర్‌.. వారిద్దరూ పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఆడితే ఆ మజానే వేరుగా ఉంటుందన్నాడు. సుదీర్ఘ కాలంగా భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవడం అమిర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.  చాలాకాలంగా ఇరుజట్ల మధ్య సిరీస్‌లు జరగకపోవడం బాధాకరమన్నాడు. కాగా, కోహ్లిని ఔట్‌ చేయడం తనకు ఈజీ అని అంటున్నాడు అమిర్‌. ఒక ఇంటర్వ్యూలో కోహ్లి బౌలింగ్‌ చేయడం కష్టంగా అనిపిస్తోందా.. అనే ప్రశ్నకు కాదు అనే సమాధానమిచ్చాడు ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌. కోహ్లి కంటే తమ దేశానికే చెందిన బాబర్‌ అజామ్‌కే బౌలింగ్‌ చేయడం కష్టమన్నాడు. ‘ టెక్నిక్‌ పరంగా చూస్తే కోహ్లి కంటే బాబర్‌ అజామ్‌ మేటి.   అజామ్‌ను ఔట్‌ చేయాలంటే చాలా శ్రమించాలి. అజామ్‌కు ఔట్‌ సైడ్‌ వేస్తే  దాన్ని డ్రైవ్‌ షాట్‌ ఆడతాడు. (లీగ్‌ ఆరంభమే కాలేదు.. అప్పుడే ఫిక్సింగ్‌ కలకలం)

స్వింగ్‌ చేస్తే దాన్ని ఫ్లిక్‌ చేస్తాడు. నిజాయితీగా చెప్పాలంటే నేను నెట్స్‌లో అజామ్‌కు బౌలింగ్‌ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. నా బౌలింగ్‌లో ఔట్‌ అవ్వడం అనేది దాదాపు ఉండదు. నాకైతే టెక్నిక్‌ పరంగా కోహ్లి కంటే అజామ్‌ మెరుగ్గా కనిపిస్తాడు’ అని అమిర్‌ తెలిపాడు. గతంలో భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌ టీ20లో కానీ,  చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ల్లో కానీ కోహ్లి-అమిర్‌ల మధ్య ఆసక్తికర పోరు నడిచిన సంగతి తెలిసిందే. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ నిర్దేశించిన 119 పరుగుల టార్గెట్‌లో రోహిత్‌ను అమిర్‌ ఆదిలోనే ఔట్‌ చేయగా, కోహ్లి అజేయంగా హాఫ్‌ సెంచరీ చేసి ఆదుకున్నాడు. అప్పుడు ఇరువురి మధ్యపోరులో కోహ్లినే పైచేయి సాధించాడు. ఆ  తర్వాత ఏడాది జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో కోహ్లిపై అమిర్‌దే పైచేయి అయ్యింది. పాకిస్తాన్‌ నిర్దేశించిన 339 పరుగుల టార్గెట్‌లో రోహిత్‌, ధావన్‌, కోహ్లిలనే ఆరంభంలోనే ఔట్‌ చేసి అమిర్‌ దెబ్బ కొట్టాడు. దాంతో ఫైనల్‌ మ్యాచ్‌లో పరాజయం పాలైన కోహ్లి గ్యాంగ్‌..రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. (ఐసీసీ అవార్డుల నామినేషన్‌లో కోహ్లి డామినేషన్‌)

మరిన్ని వార్తలు