వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా మంగళవారం హిమాచల్ప్రదేశ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆంధ్ర 30 పరుగుల తేడాతో ఓడింది. దాంతో ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండింటిలో నెగ్గి మరో మూడింటిలో ఓడిన ఆంధ్ర 8 పాయింట్లతో గ్రూప్లో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది.
తొలుత హిమాచల్ప్రదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఆంధ్ర పేసర్ చీపురపల్లి స్టీఫెన్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఛేదనలో ఆంధ్ర 20 ఓవర్లలో 118 పరుగులు మాత్రమే చేసింది. అశ్విన్ హెబ్బార్ (43; 3 ఫోర్లు, 1 సిక్స్), రికీ భుయ్ (41; 1 ఫోర్, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. హిమాచల్ బౌలర్లలో పంకజ్ జైస్వాల్ ఐదు వికెట్లు... రిషి ధావన్ 3 వికెట్లు తీశారు.
చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా!