ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ జాతీయ క్రీడా పోటీలకు వేదికలు!

20 Oct, 2022 18:53 IST|Sakshi

డిసెంబర్‌ 17 నుంచి 23వ తేదీ వరకు నిర్వహణ

15 వ్యక్తిగత, 7 టీమ్‌ విభాగాల్లో పోటీలు

అత్యధికంగా ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి క్రీడాకారుల హాజరు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యం ఇవ్వనున్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 3వ జాతీయ క్రీడాపోటీలకు వేదికలు ఖరారయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపి ఐదు చోట్ల పోటీలను నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 17 నుంచి 23వ తేదీ వరకు 15 వ్యక్తిగత విభాగాల్లో 2,763 మంది, ఏడు టీమ్‌ విభాగాల్లో 2,207 మంది దేశ వ్యాప్తంగా క్రీడాకారులు పోటీపడనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గిరిజన పాఠశాలల క్రీడా పోటీల్లో 20 రాష్ట్రాలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. 


అత్యధికంగా ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 480 చొప్పున, అత్యల్పంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ 61, సిక్కిం 83, ఉత్తర ప్రదేశ్‌ 96 మంది క్రీడాకారులతో బరిలోకి దిగనున్నాయి. 


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా ఏకలవ్య జాతీయ పోటీలను సమర్థవంతంగా చేపడతామన్నారు. పోటీలు ప్రారంభానికి ముందే ఏపీ క్రీడాకారులకు నిపుణులైన శిక్షకులతో తర్ఫీదు ఇవ్వనున్నట్టు వివరించారు. కచ్చితంగా పతకాలు వచ్చే విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 

మరిన్ని వార్తలు