Archery World Cup: సురేఖ డబుల్‌ ధమాకా

26 Jun, 2022 01:05 IST|Sakshi

మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో తొలిసారి స్వర్ణం

వ్యక్తిగత విభాగంలో రజతం

పారిస్‌: పునరాగమనంలో భారత స్టార్‌ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. పారిస్‌లో శనివారం జరిగిన ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–3 టోర్నీలో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకం, వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ జంట భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించింది.

ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ ద్వయం 152–149 పాయింట్ల తేడాతో (40–37, 36–38, 39–39, 37–35) సోఫీ డోడెమోంట్‌–జీన్‌ ఫిలిప్‌ (ఫ్రాన్స్‌) జోడీపై విజయం సాధించింది. ఒక్కో జంట నాలుగు బాణాల చొప్పున నాలుగుసార్లు లక్ష్యంపై గురి పెట్టాయి. తొలి సిరీస్‌లో భారత జోడీ పైచేయి సాధించగా, రెండో సిరీస్‌లో ఫ్రాన్స్‌ జంట ఆధిక్యంలో నిలిచింది. మూడో సిరీస్‌లో రెండు జోడీలు సమంగా నిలువగా... నాలుగో సిరీస్‌లో మళ్లీ భారత జంట ఆధి క్యం సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.  

మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్‌ అనంతరం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగంలోనూ విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ రాణించింది. ముందుగా సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సురేఖ 147–145తో సోఫీ డోడెమోంట్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎల్లా గిబ్సన్‌ (బ్రిటన్‌)తో జరిగిన ఫైనల్లో సురేఖ ‘షూట్‌ ఆఫ్‌’లో త్రుటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 148–148తో సమంగా నిలిచారు. అనంతరం విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ చెరో షాట్‌ ఇవ్వగా... గిబ్సన్, జ్యోతి సురేఖ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే గిబ్సన్‌ బాణం 10 పాయింట్ల వృత్తం లోపల ఉండగా... సురేఖ వృత్తం అంచున తగిలింది. దాంతో గిబ్సన్‌కు స్వర్ణం, సురేఖకు రజతం లభించాయి.

మరిన్ని వార్తలు