ఢిల్లీ ఓపెన్‌ చెస్‌ చాంప్‌ అర్జున్‌

30 Mar, 2022 03:28 IST|Sakshi

హర్ష భరతకోటికి మూడో స్థానం

సాక్షి, హైదరాబాద్‌: ఆద్యంతం నిలకడగా రాణించిన భారత యువతార, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ మరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. న్యూఢిల్లీలో మంగళవారం ముగిసిన ఢిల్లీ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో వరంగల్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్‌ చాంపియన్‌గా అవతరించాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరతకోటి మూడో స్థానాన్ని దక్కించుకోగా... తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ డి.గుకేశ్‌ రన్నరప్‌గా నిలిచాడు.

ఇటీవల అర్జున్‌ జాతీయ సీనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. నిర్ణీత 10 రౌండ్ల తర్వాత అర్జున్, గుకేశ్, హర్ష భరతకోటి 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. అర్జున్‌కు ‘టాప్‌’ ర్యాంక్‌ ఖాయమవ్వగా... గుకేశ్‌కు రెండో స్థానం, హర్షకు మూడో స్థానం లభించాయి.

ఈ టోర్నీలో అర్జున్‌ అజేయంగా నిలిచాడు. మొత్తం 10 గేముల్లో అతను ఏడింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు రూ. 4 లక్షలు ... రన్నరప్‌ గుకేశ్‌కు రూ. 3 లక్షల 50 వేలు.. మూడో స్థానం పొందిన హర్షకు రూ. 3 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మంగళవారం జరిగిన చివరిదైన పదో రౌండ్‌ గేముల్లో అర్జున్‌ 58 ఎత్తుల్లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కార్తీక్‌ వెంకటరామన్‌ను ఓడించగా... గుకేశ్‌ 58 ఎత్తుల్లో అభిజిత్‌ గుప్తా (భారత్‌)పై, హర్ష 71 ఎత్తుల్లో సేతురామన్‌ (భారత్‌)పై నెగ్గారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఎం.ఆర్‌.లలిత్‌ బాబు 7.5 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచాడు.

మరిన్ని వార్తలు