#ArrestKohli: రోహిత్‌ అభిమానిని చంపిన కోహ్లి ఫ్యాన్‌.. కోహ్లి అరెస్ట్‌కు డిమాండ్‌

15 Oct, 2022 15:36 IST|Sakshi

ఓ దురాభిమాని చేసిన ఘోర తప్పిదం ప్రస్తుతం టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మద్యం మత్తులో తన అభిమాని చేసిన దురాగతం కోహ్లిని ఇబ్బందుల పాలు చేసేలా ఉంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన ఈ ఉదంతం కోహ్లిని ఆట మీద దృష్టి పెట్టనీయకుండా చేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

తమిళనాడులోని మల్లూర్‌కు చెందిన ధర్మరాజ్‌, విగ్నేశ్‌ అనే యువకులు మంచి మిత్రులు, క్రికెట్‌ ప్రేమికులు. వీరిలో ధర్మరాజ్‌ విరాట్‌ కోహ్లికి విరాభిమాని కాగా, విగ్నేశ్‌.. రోహిత్‌ శర్మకు డై హార్డ్‌ ఫ్యాన్‌. వీరిద్దరు గత వారం తాగిన మత్తులో తమ అభిమాన క్రికెటర్‌ గొప్ప అంటే.. తమ అభిమాన క్రికెటర్‌ గొప్ప అంటూ గొడవ పడ్డారు. ఈ గొడవలో సహనం కోల్పోయిన విరాట్‌ అభిమాని.. రోహిత్‌ అభిమానిని కొడవలితో అతి దారుణంగా నరికి హతమార్చాడు.

ఈ ఘటనలో ధర్మరాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది. ఏంటీ ఈ దురభిమానం.. ఎటు పోతుంది ఈ ప్రపంచం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఈ ఘటనకు కోహ్లి పరోక్ష కారకుడు, అతన్ని అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.  రోహిత్ శర్మ ఫ్యాన్స్.. #ArrestKohli అనే హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు