Arshdeep Singh: టీమిండియా గబ్బర్‌ను గుర్తుచేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌..

28 Sep, 2022 19:50 IST|Sakshi

సౌతాఫ్రికాతో తొలి టి20లో టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. టీమిండియా పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చహర్‌లు చెలరేగడంతో సౌతాఫ్రికా జట్టు 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అందులో అర్ష్‌దీప్‌ మూడు వికెట్లు కాగా.. రెండు వికెట్లు దీపక్‌ చహర్‌వి ఉన్నాయి. కాగా సౌతాఫ్రికాకు టి20 క్రికెట్‌లో ఇదే అత్యంత చెత్త ఆరంభం. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడం విశేషం. రొసో, మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌లు తాము ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగారు.

ఇక అర్షదీప్‌ సింగ్‌.. టీమిండియా సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ను గుర్తుకు తెచ్చాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో దీపక్‌ చహర్‌ బౌలింగ్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ భారీ షాట్‌కు యత్నించగా.. థర్డ్‌మన్‌లో ఉన్న అర్ష్‌దీప్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో అర్ష్‌దీప్‌ క్యాచ్‌ అందుకున్న సంతోషంలో తొడ కొట్టి మీసం మెలేశాడు. కాగా టీమిండియా గబ్బర్‌ శిఖర్‌ ధావన్‌ క్యాచ్‌ పట్టిన ప్రతీసారి తొడగొట్టడం అలవాటు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు