Ashes 2021: యాషెస్‌ సిరీస్‌ డౌటే.. మెలిక పెట్టిన ఈసీబీ

5 Oct, 2021 16:36 IST|Sakshi

England To Decide On Ashes Series This Week: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సిరీస్‌ సాధ్యాసాధ్యాలపై సోమవారం సమావేశమైన ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఓ మెలిక పెట్టింది. తమ ప్రధాన ఆటగాళ్లు ఉంటేనే సిరీస్‌ ఆడతామని ప్రకటించింది. ఈ విషయమై జట్టు సభ్యులతో సంప్రదింపులు జరిపి వారంలోగా తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది. కాగా, ఇంగ్లండ్‌ జట్టులోని కొందరు సీనియర్‌ సభ్యులు ఆసీస్‌ పర్యటనకు ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులను తమతో పాటు అనుమతిస్తేనే ఆస్ట్రేలియాలో అడుగుపెడతామని వారు ఈసీబీకి స్పష్టం చేశారని సమాచారం. 

మరోవైపు కోవిడ్‌ నిబంధనలను సడలించేందుకు ఆసీస్‌ ప్రభుత్వం సైతం వెనక్కు తగ్గకపోవడంతో సిరీస్‌ సాధ్యపడడం అనుమానంగా మారింది. కాగా, ఆస్ట్రేలియాలో కఠిన క్వారంటైన్‌ నిబంధనల నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఆ దేశంలో పర్యటించేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఈ విషయమై ఇరు దేశాల ప్రధానులు స్కాట్‌ మోరిసన్‌(ఆసీస్‌), బోరిస్‌ జాన్సన్‌(యూకే)లు జోక్యం చేసుకున్నప్పటికీ సమస్య కొలిక్కివచ్చినట్లు కనబడలేదు. ఆసీస్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌ డిసెంబర్‌ 18 నుంచి జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి:  కోహ్లి సేనకు అంత సీన్‌ లేదు.. మాకు అసలు పోటీనే కాదు: పాక్ మాజీ ప్లేయ‌ర్‌

మరిన్ని వార్తలు