Pat Cummins: సిరీస్‌తో పాటు మనసులు కూడా గెలిచాడు.. 

17 Jan, 2022 17:06 IST|Sakshi

యాషెస్ సిరీస్‌ 2021-22లో ఇంగ్లండ్‌ను 4-0 తేడాతో మట్టికరిపించిన అనంతరం, ఆతిధ్య ఆస్ట్రేలియా చేసుకున్న గెలుపు సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే, ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. హోబర్ట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో ఆసీస్‌ 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం అనంతరం ఆసీస్‌ ఆటగాళ్లు షాంపేన్ బాటిల్లతో వేదికపై రచ్చ రచ్చ చేస్తుండగా, ఓ ఆసక్తికర సన్నివేశం అందరినీ కట్టి పడేసింది. 


ఇస్లాంను ఆచరించే ఆసీస్‌ ఆటగాడు ఉస్మాన్‌ ఖ్వాజా.. షాంపేన్‌తో జరుపుకునే వేడుకలకు దూరంగా వెళ్లడం గమనించిన ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్.. షాంపేన్‌ బాటిళ్లను వెనకాల పెట్టాల్సిందిగా సహచరులకు సూచించి, ఖ్వాజాను వేదికపైకి రావల్సిందిగా సైగ చేశాడు. కెప్టెన్ పిలుపుతో ఖ్వాజా వేదిక పైకెక్కి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కమిన్స్ చేసిన పనికి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. కంగారూల కొత్త సారథి సిరీస్‌తో పాటు మనసులు కూడా గెలుచుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, చాలాకాలం తర్వాత ఆసీస్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఖ్వాజా.. నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించి ఘనంగా పునరాగమనాన్ని చాటాడు.  
చదవండి: ఐపీఎల్‌ వేలం నుంచి తప్పుకున్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌..!

మరిన్ని వార్తలు