Ashes: ట్రవిస్‌ హెడ్‌ స్థానంలో తుది జట్టులోకి..! కచ్చితంగా సెంచరీ కొడతా..

1 Jan, 2022 16:31 IST|Sakshi

అద్భుత ప్రదర్శనతో యాషెస్‌ ట్రోఫీ గెలిచి జోరు మీదుంది ఆస్ట్రేలియా. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే మూడింటిలో విజయం సాధించిన కంగారూలు.. మిగిలిన రెండు కూడా గెలిచి ఇంగ్లండ్‌ను వైట్‌వాష్‌ చేయాలని భావిస్తున్నారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఆసీస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యాషెస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రవిస్‌ హెడ్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు జట్టుకు దూరమయ్యాడు.

ఈ క్రమంలో ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా ముగ్గురు ఆటగాళ్లు మిచెల్‌ మార్ష్‌, నిక్‌ మ్యాడిసన్, జోష్‌ ఇంగ్లిస్‌లను ఎంపిక చేసింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. అయితే, ఆటగాళ్లందరికీ నెగటివ్‌గా తేలిన తర్వాతే జట్టు కూర్పుపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగో టెస్టుతో పునరాగమనం చేసే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. హెడ్‌ స్థానంలో తనకు తుది జట్టులో చోటు దక్కుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను అర్థం చేసుకోగలను. ఏదేమైనా హెడ్‌ గైర్హాజరీలో సిడ్నీ టెస్టు ఆడినట్లయితే.. కచ్చితంగా మెరుగ్గా రాణిస్తాను. సెంచరీ చేస్తాననే అనుకుంటున్నా. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ ఆడతాను’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, తనకు గనుక సిడ్నీ టెస్టు ఆడే అవకాశం వచ్చినా... అది కేవలం ఒక్క మ్యాచ్‌ వరకే పరిమితమవుతుందని తెలుసునన్నాడు.

ఐదో టెస్టు నాటికి ట్రావిస్‌ హెడ్‌ కోలుకునే అవకాశం ఉ‍న్న నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా 2019లో చివరి టెస్టు ఆడిన ఖవాజా.. తాజా యాషెస్‌కు ఎంపికైనప్పటికీ ఇంతవరకు ఆడే అవకాశం రాలేదు. ఇక జనవరి 5 నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది.  

చదవండి: IPL 2022 Auction: వదిలేసినా ఆ జట్టుకే ఆడాలని కోరుకుంటున్నారు... ఇప్పటికే రాయుడు, అశ్విన్‌...

మరిన్ని వార్తలు