కోహ్లిపై మండిపడ్డ బీసీసీఐ.. మళ్లీ అగ్గి రాజేసిన రన్‌ మెషీన్‌ వ్యాఖ్యలు 

6 Sep, 2022 12:14 IST|Sakshi

BCCI Slams Kohli: టెస్ట్‌ కెప్టెన్సీ వదిలేశాక, కెరీర్‌ హీన దశలో ఉన్న నన్ను మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఒక్కడే ఫోన్‌ చేసి పలకరించాడన్న కోహ్లి వ్యాఖ్యలపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మండిపడ్డాడు. కెప్టెన్సీ వదులుకున్న తర్వాత కోహ్లికి బీసీసీఐ సహా జట్టు సభ్యులు, మాజీలు అండగా నిలబడ్డప్పటికీ కోహ్లి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశాడు. గడ్డుకాలంలో తనకెవరూ అండగా నిలబడలేదని కోహ్లి వ్యాఖ్యానించడం కరెక్ట్‌ కాదని, బీసీసీఐ అధ్యక్షుడు సహా బోర్డు సభ్యులందరూ అతనికి సోషల్‌మీడియా వేదికగా అండగా నిలబడ్డారని గుర్తు చేశాడు. 

ఒడిదుడుకులు అధిగమించి కెరీర్‌లో విజయవంతంగా ముందుకు సాగాలని తామంతా మెసేజ్‌లు చేసిన విషయాన్ని కోహ్లి మరిచాడా అని చురకలంటించాడు. ఫామ్‌ కోల్పోయి నానా తంటాలు పడుతుంటే, విశ్రాంతి అవసరమని తాము చేసిన సిఫార్సులను కోహ్లి మరిచాడని ధ్వజమెత్తాడు. ఇంత చేసినా తనకెవరు అండగా నిలబడలేదని కోహ్లి అనడం బాధాకరమని విచారం వ్యక్తం చేశాడు. అతను తిరిగి గాడిలో పడ్డాక చేసిన మేలులను మరచి ఇలా కామెంట్లు చేయడం సరికాదని హితవు పలికాడు. 

కాగా, ఆసియా కప్‌ సూపర్‌-4 దశలో పాక్‌ చేతిలో పరాజయం అనంతరం ప్రెస్‌ మీట్‌లో బీసీసీని ఉద్దేశిస్తూ కోహ్లి చేసిన వ్యాఖ్యలు మళ్లీ అగ్గి రాజేశాయి. కోహ్లి ఫామ్‌లోని వచ్చాడో లేదో మళ్లీ స్టార్ట్‌ చేశాడని అతని వ్యతిరేకులు మండిపడుతున్నారు. సమసిపోయిన అధ్యాయాన్ని మళ్లీ ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకని మరికొందరు కోహ్లికి చురకలంటిస్తున్నారు. 
చదవండి: ఒత్తిడిలో తప్పులు సహజమే.. అర్షదీప్‌కు కింగ్‌ కోహ్లి మద్దతు

>
మరిన్ని వార్తలు