Asia Cup 2022: వరుస ఓటములు.. అయినా భారత్‌ ఫైనల్‌కు చేరే ఛాన్స్‌! ఎలా అంటే?

7 Sep, 2022 10:50 IST|Sakshi

ఆసియాకప్‌-2022 లీగ్‌ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన టీమిండియా.. కీలకమైన సూపర్‌-4 దశలో చేతులెత్తేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఓటమి చెందిన భారత్‌.. శ్రీలంకతో డూ ఆర్‌ డై మ్యాచ్‌లో కూడా పరాజయం పాలైంది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌  6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

తద్వారా  ఫైనల్‌కు చేరే అవకాశాలను టీమిండియా సంక్లిష్టం చేసుకుంది. అయితే సాంకేతికంగా చూస్తే ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. అయితే టీమిండియా భవితవ్యం ఆఫ్గానిస్తాన్‌ శ్రీలంక జట్టులపై ఆధారపడి ఉంది.

భారత్‌ ఫైనల్‌కు చేరాలంటే
ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే అద్భుతాలే జరగాలి. సూపర్‌-4లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ విజయం సాధించాలి. అదే విధంగా సెప్టెంబర్ ‌8న ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా సెప్టెంబర్ ‌9న పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాలి.

ఈ క్రమంలో భారత్‌, పాక్‌, ఆఫ్గాన్‌ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్‌ ఆధారంగా మూడింటిలో ఒక జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. కాగా సూపర్‌-4లో వరుసగా రెండు విజయాలు సాధించిన శ్రీలంక దాదాపుగా ఫైనల్లో అడుగుపెట్టినట్టే. ఇక రన్‌రేట్‌ విషయానికి వస్తే.. భారత్‌(-0.126), ఆఫ్గానిస్తాన్‌(-0.589) కంటే పాకిస్తాన్‌(+0.126) మెరుగ్గా ఉంది.

టీ20 ప్రపంచకప్‌-2021లో కూడా..
టీ20 ప్రపంచకప్‌-2021లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. వరల్డ్‌కప్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలు చవిచూసిన భారత్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించడంపైనే భారత్‌ సెమీస్‌ ఆశలు ఆధారపడ్డాయి.

అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఆఫ్గాన్‌ ఓటమిపాలైంది. దీంతో భారత్‌ టీ20 ప్రపంచకప్ నుంచి ఇంటిముఖం పట్టింది. అయితే ఈసారైనా ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించాలని భారత జట్టుతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌లో విరాట్‌ కోహ్లి చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా!

మరిన్ని వార్తలు