Asia Cup 2022 IND VS PAK: పాక్‌ ఓటమికి అది కూడా ఒక కారణమే..!

29 Aug, 2022 18:57 IST|Sakshi

కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు.. నిన్న ఆసియా కప్‌లో భారత్‌ చేతిలో పాక్‌ ఓటమికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. టాస్‌ ఓడటం దగ్గరి నుండి బ్యాటింగ్‌ వైఫల్యం.. బౌలింగ్‌లో అనుభవలేమి.. కీలక సమయంలో ఒత్తిడి తట్టుకోలేకపోవడం.. ప్రతీదానికి అప్పీల్‌ చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే దాయాది ఓటమికి చాలా కారణాలు కనిపిస్తాయి. వీటన్నిటితో పాటు పాక్‌ మరో ఘోర తప్పిదం కూడా చేసింది. 

నిర్ణీత సమయంలో పాక్‌ తమ కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోవడం వల్ల భారీ మూల్యమే చెల్లించుకుంది. నిబంధనల ప్రకారం స్లో ఓవర్‌ రేట్‌ కారణం‍గా పాక్‌ వేసిన చివరి ఓవర్లలో 30 అడుగుల సర్కిల్‌ బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతించారు అంపైర్లు. ఇది టీమిండియాకు బాగా కలిసొచ్చింది. ఫీల్డింగ్‌ రెస్ట్రిక్షన్స్‌ ఉండటంతో భారత్‌ ఆఖరి 3 ఓవర్లలో భారీగా పరుగుల రాబట్టి (18 బంతుల్లో 32 పరుగులు) విజయ ఢంకా మోగించింది. 

ఈ మ్యాచ్‌లో భారత్‌ కూడా ఇదే పొరపాటు చేసింది. అందుకు పెనాల్టీగా చివరి ఓవర్‌లో 30 అడుగుల సర్కిల్‌ బయట నలుగురు ఫీల్డర్లతో మాత్రమే ఆడింది. పాక్‌ టెయిలెండర్‌ చివరి ఓవర్‌లో చెలరేగడానికి ఇదే కారణం. 

ఏదిఏమైనప్పటికీ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రతిభను తప్పక అభినందించాల్సిందే. తొలుత బౌలింగ్‌లో భువీ, హార్ధిక్‌, ఆర్షదీప్‌, ఆవేశ్ ఖాన్‌ చెలరేగడం.. అనంతరం ఛేదనలో కోహ్లి, జడేజా, హార్ధిక్‌ సమయస్పూర్తితో రాణించడం టీమిండియాను విజేతగా నిలబెట్టాయి. కరుడుగట్టిన పాక్‌ అభిమానులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా రాణించి పాక్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించిన విషయం విధితమే. 
చదవండి: Ind Vs Pak: ‘కేవలం లక్‌ వల్లే ఇండియా గెలిచింది’! అసలేం మాట్లాడుతున్నావు?

Poll
Loading...
మరిన్ని వార్తలు