Ind Vs Pak- Virat Kohli: పాక్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి!

23 Aug, 2022 16:28 IST|Sakshi
విరాట్‌ కోహ్లి(PC: BCCI)

Asia Cup 2022 India Vs Pakistan- Virat Kohli: ‘‘ఈ మధ్య విరాట్‌ కోహ్లితో నేను మాట్లాడలేదు. అయితే, గొప్పవాళ్లుగా పేరొందిన ఆటగాళ్లు సరైన సమయంలో కచ్చితంగా తామేంటో నిరూపించుకుంటారు. కోహ్లి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆసియా కప్‌ రూపంలో మంచి అవకాశం వచ్చింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ కొడితే చాలు. అతడిని విమర్శిస్తున్న నోళ్లన్నీ మూత పడతాయి’’ అని టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు.

సెంచరీ చేసేదెన్నడు!
టీమిండియా మాజీ కెప్టెన్‌, ‘రన్‌మెషీన్‌’ విరాట్‌ కోహ్లి ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. పరుగుల యంత్రంగా పేరుగాంచిన ఈ స్టార్‌ ఆటగాడు సెంచరీ సాధించి వెయ్యి రోజులు దాటి పోయింది. ఈ నేపథ్యంలో అతడి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా పలువురు విదేశీ కెప్టెన్లు, మాజీ ఆటగాళ్లు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.

విమర్శకులకు రవిశాస్త్రి చురకలు
ఇక ఆసియా కప్‌-2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనున్న నేపథ్యంలో కోహ్లి కచ్చితంగా ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు భావిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌-2021లో పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లి అర్ధ శతకాన్ని బాదిన విషయాన్ని గుర్తు చేస్తూ.. దాయాది జట్టుపై అతడు చెలరేగి ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. కోహ్లిని విమర్శిస్తున్న వారికి చురకలు అంటించాడు. 

పాక్‌పై చెలరేగితే..
‘‘కోహ్లి కంటే ఫిట్‌గా ఉండే క్రికెటర్‌ భారత జట్టులో ఒక్కరూ లేరు. తను ఒక యంత్రం.. ఒక్కసారి తను సాధించాలని గట్టిగా ఫిక్స్‌ అయితే తిరుగు ఉండదు. తను తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్‌ చాలు! తను ఇప్పుడు పరుగుల దాహంతో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆసియా కప్‌ ఆడే అవకాశం వచ్చింది.

పాక్‌తో మ్యాచ్‌లో అర్ధ శతకం బాదితే ఈ నోళ్లన్నీ మూతపడతాయి’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. కాగా రవిశాస్త్రి, కోహ్లి సన్నిహితులన్న విషయం తెలిసిందే. వీరిద్దరి నేతృత్వంలో టీమిండియా పలు చిరస్మరణీయ విజయాలు అందుకున్నప్పటికీ ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా గెలవలేకపోయింది. 

మరింత రసవత్తరంగా..
ఇదిలా ఉంటే.. ఆగష్టు 27 నుంచి ఆసియా కప్‌ ఈవెంట్‌ ఆరంభం కానుంది. శ్రీలంక- అఫ్గనిస్తాన్‌ మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆ మరుసటి రోజే.. క్రికెట్‌ ప్రపంచమమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగనుంది.

టీ20 ప్రపంచకప్‌ తర్వాత దాయాదులు తొలిసారిగా తలపడటం.. గత పరాభవం నేపథ్యంలో టీమిండియా బదులు తీర్చుకునేందుకు సిద్ధం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుంది. 

చదవండి: Asia Cup 2022: యూఏఈ చేరుకున్న టీమిండియా.. కోహ్లి ఫ్యామిలీ స్పెషల్‌ అట్రాక్షన్‌
Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ!
Shubman Gill: అరుదైన ఘనత.. రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు కొట్టిన శుబ్‌మన్‌ గిల్‌! అంతేకాదు..

>
మరిన్ని వార్తలు