Asia Cup 2022 - Ind Vs Pak: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. మాకిది గుణపాఠం.. ఇక కోహ్లి: రోహిత్‌

5 Sep, 2022 09:33 IST|Sakshi

Asia Cup 2022 Super 4 India Vs Pakistan- Rohit Sharma Comments On Loss: ‘‘ఇది ప్రతిష్టాత్మక మ్యాచ్‌. కాబట్టి తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. రిజ్వాన్‌, నవాజ్‌ల జోడీని విడదీయలేకపోయాం. వారిద్దరి అద్భుతమైన భాగస్వామ్యం మా విజయావకాశాలను దెబ్బకొట్టింది’’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. తాము మెరుగైన స్కోరు నమోదు చేసినా దానిని కాపాడుకోలేకపోయామంటూ విచారం వ్యక్తం చేశాడు.

మెరుగైన స్కోరే!
ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీ సూపర్‌-4లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. దుబాయ్‌ వేదికగా ఆదివారం(సెప్టెంబరు 4) జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 

రిజ్వాన్‌, నవాజ్‌ జోరుకు బ్రేక్‌ వేయలేకపోయిన భారత బౌలర్లు
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ 60 పరుగులతో భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌.. ఆదిలోనే కెప్టెన్‌ బాబర్‌ ఆజం వికెట్‌ కోల్పోయినా.. మరో ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ పట్టుదలగా నిలబడ్డాడు. 51 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌  ఫఖర్‌ జమాన్‌ 15 పరుగులకే పెవిలియన్‌ చేరినా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్‌ నవాజ్‌ 20 బంతుల్లోనే 42 పరుగులు సాధించి పాక్‌ విజయానికి బాటలు వేశాడు.

రవి, భువీ, అర్ష్‌దీప్‌..
ఇక 18, 19 ఓవర్లలో భారత బౌలర్లు రవి బిష్ణోయి, భువనేశ్వర్‌ కుమార్‌ వైడ్‌ల రూపంలో భారీగా పరుగులు సమర్పించుకోవడం.. కీలక సమయంలో అసిఫ్‌ అలీ ఇచ్చిన క్యాచ్‌ను అర్ష్‌దీప్‌ వదిలేయడం వంటి పరిణామాల నేపథ్యంలో గెలుపు పాక్‌ను వరించింది. ఐదు వికెట్ల తేడాతో భారత్‌ దాయాది చేతిలో ఓటమి పాలైంది.

మాకంటే పాక్‌ మెరుగ్గా ఆడింది
ఈ నేపథ్యంలో​ మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ ఆటగాళ్లు తమ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారని.. ఈ మ్యాచ్‌లో తాము చేసిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామని పేర్కొన్నాడు. ‘‘వాళ్ల జట్టులో కూడా క్లాస్‌ ప్లేయర్లు ఉన్నారు. సమయం వచ్చినపుడు తమను తాము నిరూపించుకున్నారు. 

ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. నిజానికి సెకండ్‌ ఇన్నింగ్స్‌ సమయానికి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని తెలుసు. అయితే, 180 పరుగులు చేయడం సాధారణ విషయమేమీ కాదు. మేము మెరుగైన స్కోరే నమోదు చేశాం. అయితే, దానిని కాపాడుకోవడంలో విఫలమయ్యాం.

కోహ్లిపై రోహిత్‌ ప్రశంసలు
ఈ మ్యాచ్‌లో క్రెడిట్‌ పాకిస్తాన్‌కే దక్కుతుంది. మాకంటే వాళ్లు బాగా ఆడారు’’ అని రోహిత్‌ అన్నాడు. ఇక జట్టుకు అవసరమైన సమయంలో రాణించాడంటూ హిట్‌మ్యాన్‌.. విరాట్‌ కోహ్లిని ప్రశంసించాడు. హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ వికెట్లు కోల్పోయిన సమయంలో తను బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడని కొనియాడాడు.

చదవండి: Asia Cup 2022: 'కింగ్‌ కోహ్లి వేట మొదలైంది.. ఇక ఏ జట్టుకైనా చుక్కలే'
Asia Cup 2022: పాక్‌పై టీమిండియా సరికొత్త చరిత్ర.. 10 ఏళ్ల తర్వాత!
Ind Vs Pak: కీలకమైన సమయంలో క్యాచ్‌ నేలపాలు.. అర్ష్‌దీప్‌పై మండిపడ్డ రోహిత్‌! వైరల్‌

>
Poll
Loading...
మరిన్ని వార్తలు