Asia Cup 2022 Final: సొంత అభిమానులచే తిట్ల దండకం అందుకున్న పాకిస్తాన్‌!

11 Sep, 2022 23:08 IST|Sakshi

శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌ ఫేలవ ఫీల్డింగ్‌పై సొంత అభిమానులే పెదవి విరిచారు. చేతిలోకి వచ్చిన క్యాచ్‌లను జారవిడవడం.. మిస్‌ ఫీల్డ్‌.. రనౌట్‌ చేసే అవకాశాలు వదులుకోవడం కనిపించాయి. ముఖ్యంగా పాక్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ విలువైన రెండు క్యాచ్‌లు వదిలేయడంతో విలన్‌గా మారిపోయాడు. దీంతో సొంత అభిమానులే పాకిస్తాన్‌ జట్టుపై తిట్ల దండకం అందుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే.. ఫైనల్‌ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. ఇందులో బానుక రాజపక్సవే 71 పరుగులు ఉన్నాయి. అయితే రాజపక్స ఇచ్చిన క్యాచ్‌లను రెండు సందర్భాల్లోనూ షాదాబ్‌ ఖాన్‌ వదిలేసి మూల్యం చెల్లించాడు. తొలి క్యాచ్‌ తాను వదిలేయగా.. రెండో క్యాచ్‌ను ఆసిఫ్‌ అలీ అందుకునే ప్రయత్నం చేశాడు.

అయితే ఆసిఫ్‌ అలీతో సమన్వయం లేకుండా మధ్యలో ఎంట్రీ ఇచ్చి షాదాబ్‌ క్యాచ్‌ను నేలపాలు చెయ్యడమే గాక ఏకంగా ఆరు పరుగులు సమర్పించాడు. ఆ తర్వాత తనను ఎక్కడ తిడతారో అని కాసేపు హై డ్రామా చేశాడు. దీంతో ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేశారు. ''ఈరోజు పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌ ది బెస్ట్‌ అని చెప్పొచ్చు''.. ''ముఖ్యంగా షాదాబ్‌ ఖాన్‌.. కాలం మారినా పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌లో మాత్రం మార్పు రాదు''.. ''పాక్‌ ఆటగాళ్ల ఫీల్డింగ్‌ చూసిన తర్వాత ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ పారిపోవడం ఖాయం..'' అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు.

చదవండి: Asia Cup 2022 Final: బాబర్‌ ఆజం కూడా ఊహించలేదు..

మరిన్ని వార్తలు